RS Praveen Kumar | హైదరాబాద్ : గేట్లు తెరిస్తే వచ్చే గొర్రెల మందలో తాను ఒకరిని కాలేను అని చెబుతూ సీఎం రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఒక వైపు పొగుడుతూనే మరో వైపు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఆర్ఎస్పీ మీడియాతో మాట్లాడారు.
రేవంత్ రెడ్డి తనను సుతిమెత్తగా పొగుడుతూనే అదేస్థాయిలో వార్నింగ్ ఇస్తున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి ఆహ్వానం పలికినట్లు, తాను ఆ పదవిని తిరస్కరించినట్లు చెబుతున్నారు. ఆ మాట వాస్తవమే. ప్రజాక్షేత్రంలోనే ఉండాలనుకున్నాను. కాబట్టి రేవంత్ ఆఫర్ను తిరస్కరించాను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లోకి వెళ్తే తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలంటూ మరోవైపు బెదిరిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేదా..? ఏ వేదిక మీద పని చేయాలి. ఎక్కడ పని చేయాలనే స్వేచ్ఛ తెలంగాణ ప్రజలకు లేదా..? అని ఆర్ఎస్పీ ప్రశ్నించారు.
గేట్లు తెరిస్తే చాలా మంది పిరికిపందలు, స్వార్థపరులు, అసమర్థులు వస్తున్నారు. గొర్రెల మందలాగా వస్తున్నారు. ఆ గొర్రెల మందలో ప్రవీణ్ కుమార్ ఒకరు కాలేరు. ప్రవీణ్ నిజమైన, నిఖార్సుగా, నిజాయితీగా పని చేసే వ్యక్తి. ఆ గొర్రెల మందలో ప్రవీణ్ కుమార్ ఒకడు కాలేదని రేవంత్ రెడ్డి అక్కసుతో మాట్లాడుతున్నారని ఆర్ఎస్పీ మండిపడ్డారు.
ఎంత ప్యాకేజీ తీసుకున్నావు అని సోషల్ మీడియాలో అంటున్నారు. ప్యాకేజీలకు ఆశపడితే అధికార పార్టలోనే చేరేవాడిని. ఒక యజ్ఞం కోసం బీఆర్ఎస్లో చేరాను. తెలంగాణ అభివృద్ధి కోసం వచ్చాను. తన ఆస్తులను రక్షించుకోవడానికి భయంతో పారిపోయిన పిరికిపందను కాను. ఉద్యోగాన్ని వదులకోని రాజకీయ రంగంలోకి వచ్చాను. కేసీఆర్ ఇచ్చిన అవకాశంతో పదేండ్లలో పది లక్షల మంది విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాను. పైసలు అవసరం లేదు.. ప్రజా సేవ కోసమే వచ్చాను. రేవంత్ రెడ్డి దయచేసి బెదిరించడం మానుకోవాలి. తన లోపల కూడా నడిగడ్డ గాలే ఉంది. వార్నింగ్లు ఇచ్చి హోదాను తగ్గించుకోకండి అని రేవంత్కు ఆర్ఎస్పీ సూచించారు.