హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో మళ్లీ బీజేపీ గెలిస్తే రాజ్యాంగం రద్దవుతుందని, ఇదే విషయాన్ని బీజేపీ నాయకులు చెప్తున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. 400 సీట్లలో బీజేపీని గెలిపించండి.. రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని అంటున్నారని విమర్శించారు. రాజ్యాంగం రద్దయితే రిజర్వేషన్లు ఉండవని, బడుగు బలహీనవర్గాలకు ఉద్యోగాలు రావని, గతంలో ఉన్న దుర్భర పరిస్థితులను మళ్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అనుభవిస్తారని చెప్పారు. బడుగు, బలహీనవర్గాలు తిరిగి కూలి పనిచేసుకొని బతకాల్సిందేనని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీల నుంచి దేశం, రాష్ర్టాన్ని విముక్తి చేయడానికి బీఆర్ఎస్కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. దేశం లో అపక్రటిత ఎమర్జెన్సీ అమలవుతున్నదని, సీబీ ఐ, ఈడీ, మీడియా ఇలా.. అన్నింటిని గుప్పిట్లో పెట్టుకొని మోదీ సర్కారు వాటిని దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించారు. బడే భాయ్.. చోటే భాయ్ ఒకే తాను ముక్కలని విమర్శించారు. శనివారం తెలంగాణభవన్లో వివిధ జిల్లాలకు చెందిన బీఎస్పీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణభవన్లో జరిగిన ఈ చేరికలతో గాంధీభవన్వర్గాలకు ఈ రోజు రాత్రంతా నిద్రపట్టదని అన్నారు. కాంగ్రెస్ గేట్లు తెరిస్తే గొర్రెలు వచ్చాయని, కానీ, బీఆర్ఎస్ పార్టీ గేట్లు తెరిస్తే సింహాలు వచ్చాయని చెప్పారు. నిజమైన తెలంగాణ బీఆర్ఎస్లోనే ఉన్నదని, తెలంగాణను మోసం చేసిన వాళ్లు, తెలంగాణను తాక ట్టు పెట్టిన వాళ్లు కాంగ్రెస్లో ఉన్నారని పేర్కొన్నా రు.
కపట హామీలతో అధికారంలోకి కాంగ్రెస్
ఆరు గ్యారెంటీలు ఇస్తామని కపట వాగ్దానాలు చేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని ప్రవీణ్కుమార్ ఆరోపించారు. మహిళలకు నెలకు రూ.2,500, ఆసరా పింఛను కింద రూ.4 వేలు, రైతు భరోసాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పి వాటిని ఇప్పటివరకు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరెంటు పోతున్నదని, సాగునీరు, తాగునీరు అందడం లేదని విమర్శించారు. రేవంత్రెడ్డి సోదరుడు కుంభకోణానికి పాల్పడితే సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన బీఆర్ఎస్ నేత క్రిశాంక్పై కేసు పెట్టి ఫోన్ సీజ్చేశారని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలు కాదు.. మా పిల్లల భవిష్యత్కు గ్యారెంటీ ఇవ్వండి, మా బతుకులకు గ్యారెంటీ ఇవ్వండి.. అని సూచించారు. గురుకులాల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం రేవంత్రెడ్డి ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. గురుకులాలు డ్రగ్స్, గంజాయి కేంద్రాలుగా మారా యని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేస్తామని సీఎం ప్రకటించారని, ఆ హామీ ఏమైందని నిలదీశారు. సీఎం రేవంత్రెడ్డి మాటలకే పరిమితమయ్యారని ఆరోపించారు. తెలంగాణవా దం, బహుజనవాదం వేర్వేరు కాదని పేర్కొన్నారు. తన కోసం తాను ఐపీఎస్ కాలేదని, తన కోసం తాను బీఎస్పీలో చేరలేదని, తన కోసం తాను బీఆర్ఎస్లో చేరలేదని చెప్పారు. డప్పు కొట్టిన చేతులు డాలర్లు సంపాదించాలని, చెప్పు కుట్టిన చేతులు చరిత్రను తిరగరాయాలని, ఆ తపనతోనే ఇదంతా చేస్తున్నానని తెలిపారు.
బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి పనిచేయాలి: బాల్క
ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు ఏదో పదవి ఇస్తామని ఆఫర్ చేశామని సీఎం రేవంత్రెడ్డి చెప్పడం ఆయన ఆధిపత్య కుల భావజాలం, అహంకారం ఆయనలో కనిపించిందని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బాల్క సుమన్ పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి ప్రతిఒక్కరూ పని చేయాలని పిలుపునిచ్చారు. సెల్ఫోన్ను బ్రహ్మస్త్రంగా ఉపయోగించుకోవాలని కోరారు. తన రక్తంలో అంబేద్కర్, తన గుండెలో కేసీఆర్ ఉన్నారని చెప్పారు. దళితులకు దేశంలో ఎవ్వరూ చేయని అనేక పథకాలను, కార్యక్రమాలను అమలుచేసిన ఘనత కేసీఆర్ది అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల జాబితాను పరిశీలించాలని కోరారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతోపాటు అన్ని సామాజికవర్గాలకు అవకాశం కల్పించామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, బీఆర్ఎస్ నాయకులు సైదులు, రజనీ సాయిచంద్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, తుంగ బాలు, గంధం రాములు తదితరులు పాల్గొన్నారు.
పార్టీలో ముందుండి కీలక పాత్ర పోషించాలి:కేకే
పార్టీ క్యాడర్లో కొత్త జోష్ కనిపిస్తున్నదని బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు చెప్పారు. పార్టీలో ముందుండి కీలక పాత్ర పోషించాలని పార్టీలో చేరుతున్న వారికి ఆయన సూచించారు. క్యాడర్లో కనిపిస్తున్న ఉత్సాహాన్ని ప్రణాళికాబద్ధంగా అమలుచేస్తే విజయం తధ్యమని పేర్కొన్నారు. క్యూబా లో తొమ్మిది మందితోనే తిరుగుబాటు వచ్చిందని గుర్తుచేశారు. ఆ తిరుగుబాటు కాస్త రష్యాకు వచ్చే సరికి సోషల్ రెవల్యూషన్గా మారిందని చెప్పారు. సికింద్రాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పద్మారావుగౌడ్ను ఎంపిక చేయడం ఒక విప్లవమని పేర్కొన్నారు. పార్టీలో బడుగువర్గాలు ముందుండటం పెద్ద విప్లవమని చెప్పారు.