హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కేసు పెట్టారని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీలోని తీహార్ కేంద్ర కారాగారంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ ఎమ్మెల్యే బాల సుమన్ శుక్రవారం ములాఖత్ అయ్యారు. అనంతరం ప్రవీణ్కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఏ దేశమైనా ఆదాయాన్ని పెంచుకోవడానికి రకరకాల పాలసీలు చేస్తుంటాయని, ఇందులో భాగంగానే ఢిల్లీ ప్రభుత్వం లికర్ పాలసీ తీసుకొచ్చిందని చెప్పా రు. నిర్దోషిగా నిందితులే నిరూపించుకోవాలని, అంతవరకు జైల్లో పెట్టవచ్చన్న పీఎంఎల్ఏ చట్టంలో సెక్షన్ 50లో ఉన్న నిబంధనను అడ్డంపెట్టుకొని రాజకీయ ప్రత్యర్థుల గొంతు నొకే ప్రయత్నం బీజేపీ చేస్తున్నదని విమర్శించారు. తీవ్రవాదులకు ఆర్థిక వనరులు చేరడం, డ్రగ్స్ రవాణాకు నిధుల వినియోగం, దేశ ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలిగించే చర్యలకు పీఎంఎల్ఏ చట్టం వర్తిస్తుందని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో డబ్బులే లేనప్పుడు ఈ కేసుకు పీఎంఎల్ఏ ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను, పార్టీ నాయకులను కేసులతో బెదిరిస్తారనుకుంటే అది బీజేపీ భ్రమనే అవుతుందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టంచేశారు. ఎమ్మెల్సీ కవిత ధైర్యంగా ఉన్నారని చెప్పారు.