Minister Gangula | ధాన్యం కొనుగోళ్లు సంబంధించి ఓపీఎంఎస్లో నమోదైన ప్రతి రైతు ఖాతాలు డబ్బులు బదిలీ చేశామని పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సోమవారం రూ.1500 కోట్లను బదిలీ చేశామని, ఇప్పటి వరకు రూ.11,444 రైతుల ఖాతాలకు బదిలీ అయ్యాయని వివరించారు. ఓపీఎంఎస్లో నమోదైన వెంటనే వెంటనే డబ్బులు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సోమవారం వరకు 11.10లక్షల రైతుల నుంచి 65.82 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు వివరించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ దాదాపు ముగిసిందని కేవలం ఒక వంద సెంటర్లలో మాత్రమే అక్కడక్కడ కొనుగోలు జరుగుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ప్రథమ కర్తవ్యంగా పని చేస్తుందనడానికి ఈ ధాన్యం సేకరణ నిదర్శనమన్నారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కేసీఆర్ ఆదేశంతో రైతుల ధాన్యం కొనుగోళ్లు చేపట్టామని వివరించారు.