Minister Harish Rao | హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): బీసీ కుల వృత్తిదారులు, చేతి వృత్తిదారులకు అందజేస్తున్న తరహాలోనే మైనార్టీలకు కూడా రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తామని ఆర్థిక మంత్రి హరీశ్రావు ప్రకటించారు. బ్యాంకులతో సంబంధం లేకుండా, తిరిగి చెల్లించే అవసరం లేకుండా సాయా న్ని సీఎం కేసీఆర్ అందించనున్నారని వెల్లడించారు. రెండు రోజుల్లో జీవో, మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు. మనసున్న నాయకుడు కేసీఆర్ అని, రాబోయే ఎన్నికల్లో మైనార్టీలంతా ఆయనకు మద్దతుగా నిలవాలని కోరారు. ఇటీవల పలు కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమితులైన మైనార్టీ నాయకుల అభినందన సభను హైదరాబాద్ జలవిహార్లో గురువారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ..రూ.లక్ష ఆర్థిక సహాయం మైనార్టీలకు సీఎం అందించిన శుభవార్తని తెలిపారు. కేసీఆర్ అన్నివర్గాల సంక్షే మాన్ని గురించి ఆలోచిస్తారని కొనియాడారు.
మైనార్టీల పేదరిక పాపం కాంగ్రెస్దే
దేశంలో, రాష్ట్రంలో మైనార్టీలు పేదరికంలో మగ్గిపోవడానికి కారణం కాంగ్రెస్ పాలకులేనని మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ చెప్పేదొటి చేసేదొకటని విమర్శించారు. ఈ ఒక్క ఏడాది బడ్జెట్లోనే మైనార్టీల కోసం రూ.2,200 కోట్లు కేటాయించామని, కాంగ్రెస్ పదేండ్ల పాలనలో కూడా ఇంత బడ్జెట్ ఇవ్వలేదని తెలిపారు. మైనార్టీలను సీఎం కేసీఆర్ ఎంతో గౌరవిస్తారని కొనియాడారు. మహమూద్ అలీని రెండుసార్లు మంత్రిగా చేశారని, మైనార్టీ పేద యువతుల పెండ్లికి షాదీ ముబారక్ పథకం అమలు చేస్తున్నారని తెలిపారు. ఎవరూ కలలో కూడా ఊహించని రీతిలో మైనార్టీల కోసం 204 గురుకులాలను ఏర్పాటుచేసి ఉచితంగా ఇంటర్వరకు ఇంగ్లిష్ మీడియంలో విద్యను అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని చెప్పారు.
నీట్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను ఉర్దూలో నిర్వహించాలని డిమాండ్ చేసిన సీఎం కేసీఆర్ ఒకరేనని గుర్తుచేశారు. 20 లక్షలు ఓవర్సీస్ సాలర్షిప్ ఇచ్చి మైనార్టీలు విదేశాల్లో చదివేందుకు అండగా నిలబడుతున్నారని తెలిపారు. పాతబస్తీకి చెందిన సల్వా ఫాతిమాకు డబ్బులిచ్చి పైలట్ శిక్షణ ఇప్పించగా, ఆమె నెలకు రూ.5 లక్షలు సంపాదిస్తున్నదని ఉదహరించారు. రంజాన్ గిఫ్టులు, అజ్మీర్ దర్గాలో భవన నిర్మాణానికి రూ.5 కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. దేశంలో మైనార్టీలకు సమప్రాధాన్యమిస్తూ, సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక సీఎం కేసీఆరే అని హోంమంత్రి మహమూద్ అలీ కొనియాడారు. మైనార్టీలంతా సీఎం కేసీఆర్ వెంటే నడవాలని, మళ్లీ అధికారంలోకి తేవాలని పిలుపునిచ్చారు.
కార్పొరేషన్ చైర్మన్లకు ఘన సన్మానం
పలు కమిషన్లకు చైర్మన్లుగా నియమితులైన మైనార్టీ నాయకులను హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి హరీశ్రావు సత్కరించారు. హజ్ కమిటీ చైర్మన్ సలీం, వక్ఫ్ బోర్డు చైర్మన్ మసి ఉల్లా ఖాన్, మైనార్టీ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఇన్సాక్ ఇంతియాజ్, మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిఫ్ అన్సారీ, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్, టీఎస్ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడె రాజీవ్ సాగర్, ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ తన్వీర్, ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్కు శాలువాలు కప్పి సన్మానించారు. కార్యక్రమానికి ఎంపీ రంజిత్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్, ఎమ్మెల్యేలు షకీల్, దానం నాగేందర్, ముఠాగోపాల్ హాజరయ్యారు.