రంగారెడ్డి: దేశ నిర్మాణంలో బెంగాలీ సమాజ్ పాత్ర కీలకమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం శంషాబాద్ మండలం నర్కుడలోని హైదరాబాద్ బెంగాలీ స్వర్ణ శిల్పి వివేకానంద కాళీమందిర్ లో ఆలయ ప్రధాన ద్వారాన్ని ప్రారంభించారు. అనంతరం ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ భారతదేశ ముఖచిత్రం మార్చే దృక్పథంతో ముందుకెళ్తున్న సీఎం కేసీఆర్ కు బెంగాలీల మద్దతు ఉండాలని అన్నారు.
రవీంద్రనాథ్ ఠాగూర్, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్ లాంటి మహనీయులు బెంగాల్ లో జన్మించారని వివరించారు. నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ దేశానికి అందించిన సేవలు ఎప్పటికీ గర్వకారణం, స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.వివేకానందుడు అమెరికాలో ఇచ్చిన ప్రసంగం భారతీయుల ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేసిందని తెలిపారు.
కాళీమాత ఆశీర్వదం హైదరాబాద్ పై ఉందని అన్నారు. అభివృద్ధి లో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా ఉందని ఆమె అన్నారు. సీఎం కేసీఆర్ అందరినీ సొంతవారిలా చూసుకుంటున్నారని వెల్లడించారు. బీఆర్ఎస్ సర్కార్ అందరినీ కలుపుకుని ముందుకెళ్తోందని ఆమె అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం బెంగాలీలకు అండగా ఉంటుందని కవిత పేర్కొన్నారు. ఆలయం ముందు రోడ్డు వేయించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్, బెంగాలీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు దీపాంకర్ పాల్, మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు మందిరాన్ నస్కర్, ఆలయ కమిటీ సభ్యులు హేమంత్ దాస్, వరుణ్ రాణా, శంభూ రాయ్, శరత్ రాయ్ పాల్గొన్నారు.