మాదాపూర్, సెప్టెంబర్ 18: మోకీలు, తుంటి మార్పిడిలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సులభమైన రీతిలో శస్త్రచికిత్స చేయడంలో కీలకమైన రోబోటిక్ మెషినరీ అందుబాటులోకి వచ్చింది. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో ఆదివారం కిమ్స్ దవాఖాన యాజమాన్యం ఈ యంత్రాన్ని పరిచయం చేసింది. ఈ కార్యక్రమాన్ని సినీ నటులు సుధీర్బాబు, చాందినీ, కిమ్స్ చైర్మన్ బొల్లినేని భాస్కరరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బొల్లినేని మాట్లాడుతూ.. రోబోటిక్ మెషినరీ సాయంతో మోకీలు, తుంటి మార్పిడి చికిత్సను అత్యంత సులభంగా చేయవచ్చని చెప్పారు.
మెరిల్ కంపెనీకి చెందిన క్యువిస్ ఆటోమేటెడ్ రోబోటిక్ సర్జరీ సిస్టమ్ పూర్తిగా విభిన్నమైనది, అత్యాధునికమైనదని, దీని పనితీరు అత్యంత మెరుగ్గా ఉంటుందని అన్నారు. కిమ్స్ ఆర్థొపెడిక్ విభాగాధిపతి డాక్టర్ సాయి లక్ష్మణ్ యంత్రం పనితీరును వివరించారు. రోబోటిక్ యంత్రం రోగిని పూర్తిగా సీటీ స్కాన్ చేసి ఎముక త్రీడీ మాడల్ను రూపొందిస్తుందని చెప్పారు. ఆ మాడల్ను అవసరానికి తగినట్టుగా మార్చుకోవచ్చని తెలిపారు. సాధారణ చికిత్సలో డాక్టర్లు మూడు మిల్లీమీటర్ల స్థాయిలో ఉండనే లోపాలను గుర్తించలేరని, కానీ ఈ రోబో ఒక్క మిల్లీమీటర్ కన్నా తక్కువ స్థాయిలో కూడా లోపాలను గుర్తించి మాడల్ను రూపొందిస్తుందని వివరించారు.
చేతితో చేసే చికిత్సలో కొంత వైబ్రేషన్స్ వస్తాయని, కానీ రోబో చేసే చికిత్సలో లేజర్ కోత ఉండటంతో సమస్యలు రావని చెప్పారు. ఇంప్లాంట్లు అమర్చడానికి అవసరమైన సూక్ష్మ రంధ్రాలను కూడా ఈ రోబో చేస్తుందన్నారు. ఈ విధానంలో సర్జరీలు నూటికి నూరు శాతం విజయవంతమవుతాయని, రోగి త్వరగా కోలుకుంటాడని అన్నారు. ఈ రోబో మొత్తం మోకాలు చిప్ప రిప్లేస్మెంట్తోపాటు పార్షియల్ నీ రిప్లేస్మెంట్, హిప్ రిప్లేస్మెంట్ వంటి అన్ని రకాల మార్పిడులను చేస్తుందని తెలిపారు.