హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని మారుమూల, ఏజెన్సీ గిరిజన ప్రాంతాలను అనుసంధానం చేయటం కోసం ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. గిరిజన ఆవాసాల రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం గిరిజన సంక్షేమశాఖకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 1,000 కోట్లు కేటాయించింది. గిరిజన సంక్షేమశాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్.. ఇరు శాఖల ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. అనుసంధానం లేని గిరిజన ఆవాసాలను మిషన్మోడ్లో రోడ్లు నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు. రాష్ట్రంలో 78 నియోజకవర్గాల్లోని 2,053 ఎస్టీ ఆవాసాల్లో 3,819 కిలోమీటర్ల బీటీ రోడ్లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి.
గిరిజన ఆవాసాల్లో 100 మంది వరకు జనాభా ఉన్న గ్రామాలను కూడా అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. 5 లక్షల గిరిజనులకు ప్రయోజనం కలిగే ఈ బృహత్తర కార్యాన్ని చేపట్టేందుకు పకడ్బందీ కార్యాచరణ రూపొందించాలని, ఇందు కోసం క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఫ్రభుత్వం ఆదేశించింది. 3 ఐటీడీఏల్లోని 11 జిల్లాలలో గిరిజన ఆవాసాలకు బీటీ రహదారులకుగాను ఎస్టీఎస్ఎఫ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ప్రభుత్వం అన్ని గిరిజన ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి 4,718 గిరిజన ఆవాసాలకు (మొత్తం గిరిజన ఆవాసాల్లో 38%) రహదారి అనుసంధానత లేదని గుర్తించింది. స్వరాష్ట్రంలో ఇప్పటి వరకు 1,682 గిరిజన ఆవాసాలకు రూ.1,276 కోట్లు ఖర్చుచేసి బీటీ లింక్ రోడ్లను నిర్మించింది. తద్వారా 5.89 లక్షల గిరిజన జనాభాకు ఇప్పటికే ప్రయోజనం కలిగింది.