భీమ్గల్, ఫిబ్రవరి 23: దేశంలో మరెక్కడా లేనివిధంగా రాష్ట్రంలో బంజారాల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బంజారాల జనాభా అధికంగా ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ర్టాల్లోనూ తెలంగాణలో గిరిజనుల అభివృద్ధి కోసం అమలవుతున్న కార్యక్రమాలు కానరావని తెలిపారు. గురువారం నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో నిర్వహించిన గిరిజనుల సంత్ సేవాలాల్ మహరాజ్ 284వ జయంతి ముగింపు ఉత్సవాల్లో మంత్రి వేముల పాల్గొన్నారు.
రూ.50 లక్షల నిధులతో నిర్మించిన బంజారా భవన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కేవలం 700 తండాలు మాత్రమే గ్రామ పంచాయతీలుగా ఉండేవని అన్నారు. గిరిజనులకు పాలనాధికారం కల్పించాలనే లక్ష్యంతో 500 జనాభా కలిగిన ప్రతి తండాకు గ్రామ పంచాయతీ హోదా కల్పించడంతో రాష్ట్రంలో కొత్తగా 2,400 తండాలు జీపీలుగా అవతరించినట్టు చెప్పారు.
గిరిజన బిడ్డల కోసం కొత్తగా 300 వరకు ఎస్టీ గురుకులాలను, ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు. ఆరు శాతానికి పరిమితమైన గిరిజన రిజర్వేషన్ను జనాభా ప్రాతిపదికన పది శాతానికి పెంచిన ఫలితంగా అదనంగా 3,200 మందికి ఇంజినీరింగ్లో, 190 మందికి మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశాలు లభించాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వేముల సురేందర్రెడ్డి స్మారక క్రికెట్ టోర్నీలో గెలుపొందిన జట్లకు ట్రోఫీ అందజేశారు.