హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల రద్దీలో అరుదైన రికార్డును సాధించింది. ఇటీవల ఈ ఎయిర్పోర్ట్ నుంచి దేశీయ, అంతర్జాతీయ టెర్మినళ్ల నుంచి ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండగా, ఒక్క డిసెంబర్ నెలలోనే 22.51 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించడం విశేషం.
ఇది దేశంలోని మిగతా అంతర్జాతీయ విమానాశ్రయాలతో పోల్చితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ రెండోస్థానంలో నిలిచిందని జీఎమ్మార్ సంస్థ ప్రకటించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1.8 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించినట్టు పేర్కొన్నది. వేగంగా వృద్ధి సాధిస్తున్న ఎయిర్పోర్ట్గానూ ఇది రికార్డు సాధించింది. ఒక్క ఏడాదిలోనే ఈ విమానాశ్రయం నుంచి 2.10 కోట్ల మంది ప్రయాణం సాగించారు. డిసెంబర్లో క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలు, సెలవులు కలిసి రావడంతో అనేక మంది ప్రయాణం చేసినట్టు జీఎమ్మార్ అధికారులు చెబుతున్నారు.