హైదరాబాద్, మార్చి 10(నమస్తే తెలంగాణ): భూ సమస్యల పరిషారంలో జాప్యాన్ని నివారించడానికి ఇక నుంచి రెవెన్యూ, స్టాంప్స్-రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ఒకే గొడుగు కిందికి తీసుకొస్తున్నట్టు రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం ఒక ప్రత్యేక పోర్టల్ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో భూముల సర్వే కోసం అమలుచేస్తున్న పాత పద్ధతులకు స్వస్తి చెప్తూ, అత్యాధునిక రోవర్ పరికరాలతో భూముల సర్వే నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే మండలానికి ఒకటి చొప్పున 460 రోవర్లను కొనుగోలు చేశామని తెలిపారు. వచ్చే బడ్జెట్లో మరో 400 రోవర్ల కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఈ మేరకు రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖలకు సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు మంత్రి పొంగులేటి అందజేశారు. అనంతరం పలు అంశాలను పొంగులేటి వెల్లడించారు. రాష్ట్రంలో నక్షా (మ్యాప్) లేని 373 గ్రామాల్లో త్వరలోనే రీ-సర్వే చేపట్టనున్నామని, ఇందుకు సంబంధించి 2026-27 బడ్జెట్లో తగిన నిధులు కేటాయించాలని ఉప ముఖ్యమంత్రిని కోరామని తెలిపారు. ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలకు నూతన భవనాల నిర్మాణం కోసం అవసరమైన బడ్జెట్ కేటాయించాలని కోరినట్టు పేర్కొన్నారు.