ఆదిలాబాద్, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లా మావల మండల తహసీల్దార్ కార్యాలయంలో ఇద్దరు రెవెన్యూ అధికారులు ఓ రైతు నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఆదివారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్కు చెందిన రైతు యతీంత్రనాథ్ యాదవ్ మావల శివారులోని తన 14 ఎకరాల భూమికి సంబంధించి నాలుగు పాసు పుస్తకాల్లో మార్పులు చేయాలని కలెక్టర్కు దరఖాస్తు చేసుకున్నాడు.
ఇందుకు ధరణి పోర్టల్లో రిపోర్టు పంపేందుకు మావల తహసీల్దార్ ఆరిఫా సుల్తానా రూ.2 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో యతీంత్రనాథ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించి విషయం చెప్పాడు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం.. మావల తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ హన్మంతరావు రైతు నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. విచారణ అనంతరం తహసీల్దార్ ఆరిఫా సుల్తానాను కూడా అరెస్ట్ చేశారు. నిందితులను కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నట్టు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.