Sheep Distribution | హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : గొర్రెల పంపిణీ పథకంపై కక్ష సాధింపు కోసం తహతహలాడుతున్న ప్రభుత్వం… డీడీలు చెల్లించిన వారికి లబ్ధి చేకూర్చే అంశంపై మాత్రం దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం గొర్రెల పంపిణీ పథకంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. అయితే ఇప్పటికే పథకంలో భాగంగా తమ వాటా సొమ్మును డీడీల రూపంలో చెల్లించిన లబ్ధిదారుల సమస్యను మాత్రం పట్టించుకోలేదు. ఈ సమస్యను అధికారులు సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆయన స్పందించలేదని తెలిసింది. దీంతో డీడీలు చెల్లించిన సుమారు 85 వేల మంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ఒక్కో యూనిట్కు 21 గొర్రెలు
కేసీఆర్ ప్రభుత్వం అర్హులైన వారికి ఒక్కో యూనిట్ (21 గొర్రెలు) సబ్సిడీలో అందించారు. ఒక్కో యూనిట్కు ధర రూ. 1.75 లక్షలు కాగా, ప్రభుత్వ వాటా రూ. 1,31,250 కాగా లబ్ధిదారుల వాటా రూ. 43,750గా నిర్ణయించింది. ఈ పథకానికి సుమారు 1.17 లక్షల మంది తమ వాటా కింద ఒక్కొక్కరు రూ. 43750 డీడీల రూపంలో చెల్లించారు. కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల సమయానికి సుమారు 32వేల మందికి ఒక్కో యూనిట్ (21 గొర్రెలు) పంపిణీ చేసినట్లు తెలిసింది. ఇంకా సుమారు 85వేల మందికి గొర్రెలను పంపిణీ చేయాల్సి ఉన్నది.
బ్యాంకుల్లో 372 కోట్లు
85 వేల లబ్ధిదారులు ఒక్కొక్కరు తమ వాటాగా చెల్లించిన రూ. 43750 సొమ్ము మొత్తం సుమారు రూ. 372 కోట్లు బ్యాంకుల్లో మూలుగుతున్నాయి. ఒకవేళ ప్రభుత్వం డీడీలు చెల్లించిన వారికి గొర్రెలను పంపిణీ చేయాలనుకుంటే సుమారు రూ. 1115 కోట్లు వెచ్చిస్తే సరిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వీలైతే గొర్రెలు పంపిణీ చేయాలని, లేనిపక్షంలో తమ వాటా సొమ్మును తిరిగి ఇవ్వాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రతిరోజు కలెక్టరేట్ల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకుండా పోయింది.