మోదీ విషయ పరిజ్ఞానంతో వ్యవహరించడం లేదు. గుజరాతీ లెక్కనే ఆలోచిస్తున్నడు! గుజరాత్ ఆధిపత్యం కోసమే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నడు. గుజరాత్ సీఎం అమెరికా, కెనడా దేశాల పర్యటనకు అనుమతినిచ్చి, నా పర్యటనకు అనుమతించలేదు.
హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : నిన్నటి వరకు బీజేపీతో అంటకాగిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి తత్వం బోధపడినట్టున్నది. అవసరం ఉన్నా లేకపోయినా, సందర్భమైనా కాకపోయినా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్రమోదీని పొగిడిన సీఎం.. ఇప్పుడు ప్లేటు ఫిరాయించారు. ప్రధానిపై తిట్ల దండకం మొదలుపెట్టారు. తన పథకాలకు, పాలనకు గుజరాత్ రాష్ట్రమే స్ఫూర్తి అంటూ డబ్బాకొట్టిన రేవంత్.. ఇప్పుడు ‘గుజరాత్ కుట్రలు’ అంటూ ఊగిపోతున్నారు. దీనంతటికీ సీఎం రేవంత్రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడమే ప్రధాన కారణం. సోమవారం ప్రెస్మీట్ పెట్టి మరీ బీజేపీని, నరేంద్రమోదీని, గుజరాత్ను నిందించారు. 76 సార్లు ఢిల్లీకి వెళ్లి పదుల సందర్భాల్లో ప్రధానిని, కేంద్ర మంత్రులను కలిసి, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో విందులు చేసుకొన్న వ్యక్తి.. ఇప్పుడు వారిపైనే చిందులు వేయడం మొదలుపెట్టారు. 2023 డిసెంబర్లో అధికారం చేపట్టింది మొదలు.. నిన్న మొన్నటివరకు తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ సమైక్య పాలన సాగుతున్నట్టుగా నడిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అకస్మాత్తుగా ప్లేటు ఫిరాయించి.. గుజరాత్ మాడల్ను దూషించడం, మోదీని విమర్శించడంపై రాజకీయ వర్గాల్లో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటినుంచి కేంద్ర ప్రభుత్వానికి ‘జీ హుజూర్’ అన్నట్టుగా వ్యవహరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంతో సఖ్యతగా లేకపోవడం వల్ల రాష్ర్టానికి నిధులు రాలేదని ఆరోపించారు. కేంద్రంతో ఎలా ఉండాలో తనకు తెలుసంటూ బీరాలు పలికారు. మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటేనే నిధులు వస్తాయని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. ప్రతి సభలోనూ బీజేపీకి, ప్రధాని మోదీకి బాకా ఊదారు. ఏకంగా మోదీని ‘బడే భాయ్’ అంటూ ఆకాశానికి ఎత్తేసిన సంగతి తెలిసిందే. 2024 మార్చి 4న ఆదిలాబాద్లో జరిగిన సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఇదే వేదికపై సీఎం రేవంత్రెడ్డి మోదీని ‘బడే భాయ్’ అంటూ సంబోధించారు. ‘గుజరాత్ తరహాలో తెలంగాణ కూడా అభివృద్ధి చెందాలి’ అని ఆకాంక్షించారు.
గుజరాత్కు ఇచ్చినట్టే తెలంగాణకు కూడా నిధులు ఇవ్వాలని, దీనికి ప్రధాని నరేంద్ర మోదీ సహకారం అవసరమని వ్యాఖ్యానించారు. ‘వికసిత్ భారత్లో భాగస్వాములం అవుతాం’ అని ప్రకటించారు. ఓ సందర్భంలో తన పాలనకు మోదీయే స్ఫూర్తి అని వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంలో ప్రధాని హైదరాబాద్కు వచ్చి, సికింద్రాబాద్ మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆనాటి వీడియోను మోదీ ట్వీట్ చేయగా, సీఎం రేవంత్రెడ్డి రీట్వీట్ చేస్తూ ప్రధానిపై తన భక్తిభావాన్ని చాటుకున్నారు. రాష్ర్టానికి గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ నియామకం అయిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. ఈ విషయం తనకు మొదట ఫోన్ చేసి చెప్పింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని, ఆ తర్వాత సీఎం రేవంత్రెడ్డి ఫోన్ చేసి ‘తెలంగాణకు స్వాగతం’ అంటూ చెప్పారని పేర్కొన్నారు. ఇటీవలే ప్రధాని మోదీ హైదరాబాద్లో మాట్లాడుతూ ‘మీరు అనుకున్న స్థాయికి చేరాలంటే నాతో కలిసి నడువండి’ అని రేవంత్ను ఆహ్వానించగా, ఆయన ముసిముసి నవ్వులు నవ్విన సంగతీ తెలిసిందే.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీకి వంతపాడిన రేవంత్రెడ్డి సోమవారం ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించారు. వాస్తవానికి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బద్ధశత్రువుగా భావిస్తున్న బీజేపీ, మోదీతో రేవంత్రెడ్డి సన్నిహితంగా ఉండటంపై మొదటి నుంచీ విమర్శలు ఉన్నాయి. తనపై ఉన్న కేసుల నుంచి రక్షించుకునేందుకు బీజేపీ, కేంద్ర ప్రభుత్వాలను రేవంత్రెడ్డి ఒక రక్షణ కవచంలా వాడుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. కేవలం తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రేవంత్రెడ్డి బీజేపీ పాట పాడుతున్నారంటూ కొందరు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అధిష్టానాన్ని హెచ్చరించారు. రేవంత్రెడ్డి మాత్రం వీటన్నింటినీ పట్టించుకోకుండా బీజేపీని, గుజరాత్ను, మోదీని పొగడ్తలతో ముంచెత్తారు.
ఇప్పుడు సీఎం అమెరికా పర్యటనను అడ్డుకోవడంతో ప్లేటు ఫిరాయించారు. మోదీపై, గుజరాత్పై ఆరోపణలు గుప్పించారు. సీఎం విమర్శలను రాజకీయ విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు. 76 సార్లు ఢిల్లీకి వెళ్లి, పదుల సార్లు కేంద్ర మంత్రులను కలిసి, ఉత్త చేతులతో తిరిగి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వ వివక్ష కనిపించలేదా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టులు మంజూరు చేయాలని, నిధులు కేటాయించాలని ఎన్నిసార్లు మొత్తుకున్నా పట్టించుకోనప్పుడు తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని అనిపించలేదా? అని నిలదీస్తున్నారు. మోదీని పొగిడినన్ని రోజులు ఆయన ‘గుజరాతీ’గా వ్యవహరిస్తున్నారనే విషయం గుర్తుకు రాలేదా? అని అడుగుతున్నారు. ఇప్పుడు నిజస్వరూపం తెలిసి, తత్వం బోధపడిందా? అని ఎద్దేవా చేస్తున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ తెలంగాణను నిర్లక్ష్యం చేస్తున్నారని గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించింది. కేంద్రప్రభుత్వం తెలంగాణకు అదనంగా చిల్లిగవ్వ కూడా ఇవ్వదని, తెలంగాణ అభివృద్ధిని ఓర్చుకోరని కేసీఆర్ ఏనాడో గ్రహించారు. అందుకే కేసీఆర్ అనేక సభల్లో బీజేపీ డొల్లతనాన్ని బయటపెట్టారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న ద్రోహంపై గళమెత్తారు. జాతీయ స్థాయిలో బీజేపీ తీరును ఎండగట్టారు. దక్షిణాది రాష్ర్టాలపై బీజేపీ సవతితల్లి ప్రేమ చూపుతున్నదని కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనేక వేదికలపై నిర్మొహమాటంగా చెప్పారు.