హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తేతెలంగాణ): కార్పొరేట్ కంపెనీలు తమ సీఎస్ఆర్ నిధుల్లో ఎకువ మొత్తాన్ని స్థానిక ప్రాంతాల అభివృద్ధికి కేటాయించాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. సమాజాభివృద్ధికి చేసేది ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా చూడాలని కోరారు. సీఎస్ఆర్ నిధులకు సంబంధించి వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో ఆయన బుధవారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కంపెనీలు సీఎస్ఆర్కు చేస్తున్న వ్యయాన్ని వందకు వందశాతం సత్ఫలితాలు ఇచ్చేలా ఉండాలని అన్నారు. తమ ప్రభుత్వం విద్యా, వైద్యం, జల వనరుల సంరక్షణకు ప్రాధాన్యమిస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం, కంపెనీలు కలిపి చేసే వ్యయంతో తెలంగాణ విద్యార్థులను ప్రపంచస్థాయి నైపుణ్యం కలిగినవారీగా తీర్చిదిద్దాలని కోరారు. సీఎస్ఆర్ నిధుల వినియోగంలో ఒక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నియమించామని తెలిపారు.