KTR | రైతు డిక్లరేషన్ అనేది ఒక బోగస్ పత్రమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. డిక్లరేషన్ పేరిట రైతులకు చిత్తు కాగితం ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. డిక్లరేషన్ ఇచ్చిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. హనుమకొండలో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ.. డిక్లరేషన్ అమలుకు రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులను గల్లాపట్టి నిలదీయాలని సూచించారు.
రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని కేటీఆర్ అన్నారు. రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఎందుకు ఇవ్వడం లేదని సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ జరిగిందా అని అడిగారు. రైతు కూలీలకు రూ.12వేలు ఇస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. అన్ని పంటలు బోనస్ ఇచ్చి కొంటామన్నారని గుర్తుచేశారు. కౌలు రైతులకు ఎకరానికి రూ.14వేలు వస్తుందా అని ప్రశ్నించారు. పంటబీమా పథకం ఎక్కడకు పోయిందని అడిగారు. అసైన్డ్ భూములకు పట్టాలు ఎప్పుడిస్తారన్నారు.
దుక్కి దున్నే రైతులను దారుణంగా వంచించారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ది మెగా రైతు మేళా కాదు.. దగా రైతు మేళా అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కరోనా కంటే డేంజర్ అని సెటైర్ వేశారు. చెడ్డీ గ్యాంగ్ కంటే డేంజర్ కాంగ్రెస్ నాయకులు అని విమర్శించారు. డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో క్రమం తప్పకుండా రైతుబంధు పడేదని గుర్తుచేశారు. కేసీఆర్ హయాంలో నాట్లు వేసే సమయంలో రైతుబంధు పడేదని గుర్తుచేశారు. కేసీఆర్ తీసుకొచ్చిన రైతుబంధు పథకాన్ని 12 రాష్ట్రాలు కాపీ కొట్టాయని తెలిపారు. గతంలో రైతులు పెట్టుబడి కోసం అప్పుల పాలయ్యే వారని గుర్తుచేశారు. రైతులకు 11 విడతలుగా రూ.73 వేల కోట్లు ఇచ్చారని తెలిపారు. కానీ కాంగ్రెస్ వచ్చాక రైతు బంధు సమయానికి ఇవ్వడం లేదని తెలిపారు. సర్పంచ్ ఎన్నికల ముందు ఓట్ల కోసం ఒక్కసారే రైతు భరోసా ఇచ్చారని అన్నారు.
డిక్లరేషన్ అమలుకు రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులను గల్లాపట్టి నిలదీయాలని కేటీఆర్ అన్నారు. రైతన్నలు కాళ్లు పట్టుడు బంద్ చేసి.. కాంగ్రెస్ వాళ్ల కాలర్ పట్టాలని సూచించారు. దండం పెట్టడం కాదు.. కాంగ్రెస్ పార్టీకి పిండం పెట్టండి.. అట్లయితేనే రైతులకు మంచి రోజులు వస్తాయని అన్నారు. తాలు తీస్తే రైతులు నీ తోలు తీస్తారని సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. మక్కలు కొనకపోతే నీ ప్రభుత్వం వెయ్యి ముక్కలవుతుందని వార్నింగ్ ఇచ్చారు.