హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో సాగుతున్నది కాంగ్రెస్ సిద్ధాంతాల పాలన కాదని, ప్రధాని మోదీ ఆదేశాల మేరకు నడిచే ‘ప్రైవేట్ ఫ్రాంచైజీ పాలన‘ అని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు ఆయన శనివారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి బహిరంగ లేఖ రాశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో మోదీ సర్కార్ తీసుకొచ్చిన వీబీజీ రామ్ జీని తెలంగాణ క్యాబినెట్ ఆమోదించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అనుసరిస్తున్న విధానానికి, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు అస్సలు పొంతనలేదని దాసోజు శ్రవణ్ తన లేఖలో ఎండగట్టారు. వీబీజీ రామ్ జీ బిల్లును పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ వ్యతిరేకించారని గుర్తుచేశారు. తెలంగాణలో మాత్రం ఈ చట్టాన్ని ఆమోదించడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తున్నదని పేరొన్నారు. ఇది కేంద్రంలోని బీజేపీతో రేవంత్ రెడ్డికి ఉన్న లోపాయికారీ ఒప్పందానికి ప్రత్యక్ష నిదర్శనమని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ పాలిత కర్ణాటక ప్రభుత్వం ఈ చట్టాన్ని క్యాబినెట్లో తిరసరించడమే కాకుండా, సుప్రీంకోర్టును ఆశ్రయించిందని, పంజాబ్ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి నిరసన తెలిపిందని చెప్పారు. ఈ విధానం వల్ల రాష్ట్ర బడ్జెట్ పై రూ.5వేల కోట్లకు పైగా అదనపు భారం పడుతుందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఇటీవల ప్రధానికి లేఖ రాశారని గుర్తుచేశారు. తెలంగాణ మాత్రం మోదీ-అమిత్ షా ఆదేశాలకు లొంగిపోయిందని దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు.