Revanth Reddy | హైదరాబాద్, ఫిబ్రవరి 3(నమస్తే తెలంగాణ) : ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీస్తున్నదని.. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, దక్షిణ తెలంగాణలో ఉమ్మడి మెదక్, నారాయణపేట జిల్లాలో బీఆర్ఎస్ బలంగా ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ‘మనం అధికారంలో ఉన్నాం.. మీరు ఏం చేస్తారో చేయండి.. ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకోవాలి’ అని మంత్రులకు సూచించినట్టు సమాచారం. అధికారాన్ని వినియోగించడమా? పోలీసులను ప్రయోగించడమా? స్థానిక పరిస్థితులకు అనుగుణంగా బీజేపీతో సర్దుబాటు ప్రయత్నాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని మంత్రులకు సీఎం సూచించినట్టు తెలిసింది. సిట్ విచారణకు కేసీఆర్ను పిలువడం, తదనంతర పరిణామాలపై ప్రజలు ఏమనుకుంటున్నారని ఆరా తీసినట్టు సమాచారం. మంగళవారం హైదరాబాద్లోని మల్కాజిగిరి పార్లమెంట్ కార్యాలయంలో పార్లమెంట్ ఇన్చార్జి మంత్రులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏఐసీసీ ఢిల్లీ దూత మీనాక్షీ నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ తదితరులు హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నాలుగు ప్రత్యేక ఏజెన్సీల ద్వారా సర్వే చేయించిన సీఎం రేవంత్రెడ్డి.. వచ్చిన ఫలితాలను చూసి కంగుతిన్నట్టు తెలిసింది. రెబల్స్ ప్రభావం ఉన్నదని, వారిని పోటీ నుంచి తప్పించడంలో మంత్రులు విఫలమయ్యారని అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.
పార్లమెంట్లవారీగా ఒక్కో ఇన్చార్జి మంత్రి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం రేవంత్రెడ్డి.. అనంతరం సర్వే నివేదికలను బయటపెట్టినట్టు తెలిసింది. ఒక్కో సర్వే ప్రతిని మంత్రులకు అందిస్తూ.. ఏయే జిల్లాలో పార్టీ వెనుకబడి ఉన్నదో గణాంకాలు సహా వివరించినట్టు తెలిసింది. ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నదని చెప్పినట్టు సమాచారం. ఆయా జిల్లాల మున్సిపాలిటీల్లో గెలుపు కోసం ఇన్చార్జి మంత్రులు దృష్టిపెట్టి పనిచేయాలని ఆయన హెచ్చరించినట్టు తెలిసింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బీజేపీకి కూడా కొంత సానుకూల వాతావరణం కనిపిస్తున్నది, గతంలో కంటే వారికి ఓట్లు పెరిగే అవకాశాలున్నట్టు సర్వేలు చెప్తున్నాయని, ఈ నేపథ్యంలో స్థానిక నేతలు వారి వీలును బట్టి బీజేపీతో లోపాయికారి సర్దుబాటు ప్రయత్నాలు చేసుకోవాలని మంత్రులకు సూచించినట్టు తెలిసింది. ఈ అంశంలో మంత్రులు కొంత జాగ్రత్తగా, స్థానిక పార్టీ నేతల సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించినట్టు తెలిసింది. ఈ రాత్రే మంత్రులు జిల్లాలకు వెళ్లాలని, ప్రతిరోజూ నివేదిక తనకు పంపాలన్నట్టు సమాచారం