రామంతాపూర్, అక్టోబర్ 15: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి డబ్బులు అడిగితే తాను ఇవ్వలేదనే కక్షతో ఇప్పుడు టికెట్ కేటాయించలేదని ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి ఆరోపించారు. 25 ఏండ్లుగా పార్టీ కోసం కష్టపడ్డానని, తనలాంటి వారిని మోసం చేసిన రేవంత్కు ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. ఆదివారం హబ్సిగూడలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. పీసీసీ చీఫ్వి కాదు.. ఆఫ్ట్రాల్ మనిషివని మర్చిపోవద్దని హితవుపలికారు.
ఫహీం అనే వ్యక్తిని పక్కన పెట్టుకొని రేవంత్ నియంతలా వ్యవరిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ ప్రతి నియోజకవర్గంలో ముగ్గురితో చీకటి ఒప్పందాలు చేసుకొని, పార్టీలో ఉన్నవారిని బయటకి పంపి, కాంగ్రెస్ టికెట్లు అమ్ముకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని, లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేకు పంపుతానని లక్ష్మారెడ్డి తెలిపారు. రెండు రోజుల్లో తన తదుపరి కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు. కాగా, రాగిడి లక్ష్మారెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంపై అభిమానులు, కార్యకర్తలు రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.