వికారాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తై నెల రోజులు దాటినా సన్న రకం వడ్లకు బోనస్ చెల్లించడంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నది. సన్నాలు సాగు చేసిన రైతులకు క్వింటాకు రూ.500 ఇస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీని తుంగలో తొక్కింది. కేవలం సేకరించిన ధాన్యా నికే చెల్లింపులు పూర్తి చేయడంతో జిల్లాలోని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సన్నరకం వడ్లకు ప్రైవేట్ మార్కెట్లో అధిక ధర ఉన్నా బోనస్ కోసం కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తూ ఇబ్బందులు పెట్టడంపై రైతులు మండిపడుతున్నారు.
జిల్లాలో రెండు సీజన్లో సన్న రకం ధాన్యాన్ని విక్రయించిన రైతులకు రూ.6.42 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నది. 2025 యాసంగిలో 8,921 మెట్రిక్ టన్నుల సన్న రకాన్ని రైతుల నుంచి సేకరించగా రూ. 4.46 కోట్లు.. అలాగే, 2026 యాసంగిలో 39,228 క్వింటాళ్ల సన్నరకం ధాన్యాన్ని రైతులు విక్రయించగా రూ.1.96 కోట్ల బోనస్ బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నది. మరోవైపు రైతులు బోనస్ డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నా ప్రభుత్వం జాప్యం చేస్తుండడం గమనార్హం.
సీఎంఆర్ ఇవ్వడంలో తీవ్ర జాప్యం..
సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) విషయంలో మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రైస్ మిల్లర్లకు ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి సర్కార్కు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సీఎంఆర్ రైస్ ప్రభుత్వానికి తిరిగి ఇవ్వకుండా ఏండ్ల కొద్దీ పెండింగ్లో పెట్టి పక్కదారి పట్టిస్తున్నారనే ప్రచారం జిల్లాలో జోరుగా జరుగుతున్నది. ప్రతి ఏడాది రెండు సీజన్లలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి, మర ఆడించి బియ్యంగా మార్చి ఇచ్చేందుకు మిల్లర్లకు ప్రభుత్వం కేటాయిస్తూ వస్తున్నది.
సర్కార్ మిల్లర్లకు ఇచ్చిన ధాన్యంలో 67 శాతం మేర బియ్యాన్ని తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, కొందరు మిల్లర్లు రెండు, మూడేండ్లు దాటినా సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి అందించకుండా..పక్కదారి పట్టిస్తూ ప్రభుత్వానికి రూ.కోట్లలో నష్టం కలిగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సీఎంఆర్ రైస్ను దారిమళ్లిస్తూ రూ.కోట్లలో ఆర్జిస్తున్న మిల్లర్లపై పౌరసరఫరాల శాఖ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడంపై జిల్లావాసులు మండిపడుతున్నారు.
మిల్లర్లతో ములాఖత్ కావడంతోనే పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. గతేడాది ఖరీఫ్కు సంబంధించి 50,914 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని మిల్లర్లు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు 24,195 మెట్రిక్ టన్నులే అందించారు. అలాగే.. గతేడాది రబీకి సంబంధించి 35,807 మెట్రిక్ టన్నుల రైస్ను మిల్లర్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 5,091 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ను అందించారు. మరో 30 వేల మెట్రిక్ టన్నులకుపైగా సీఎంఆర్ రైస్ ప్రభుత్వానికి అందజేయాల్సి ఉన్నది.