CM Revanth Reddy | హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకుంటామని భావించిన కాంగ్రెస్ పార్టీకి పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ చుక్కలు కనిపిస్తున్నాయి. కనీసం గౌరవప్రదమైన సంఖ్యలోనైనా ఎంపీ సీట్లు గెలుచుకుంటామా? లేదా? అన్న భయం ఆ పార్టీని వెంటాడుతున్నది.
ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మూడు స్థానాలు పరేషాన్ చేస్తున్నాయి. తన సొంత జిల్లాలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్తోపాటు ఎంపీగా తన సిట్టింగ్ స్థానం మల్కాజిగిరిని గెలుచుకోవడం రేవంత్రెడ్డికి ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ మూడింటిని గెలుచుకోకపోతే తన రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందోనన్న దిగులు ఆయనను వెంటాడుతున్నది.
ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన పార్టీలోని ఇతర నేతలు తన కుర్చీ లాగేస్తారేమోనన్న భయం ఆయనను పీడిస్తున్నది. అందుకేనేమో ఆయన పదే పదే తన సొంత జిల్లాను చుట్టి వస్తున్నారు. ఈ ఎన్నికల సమయంలో ఇప్పటికి ఆయన ఏడెనిమిదిసార్లు పాలమూరు వెళ్లివచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
తన సొంత జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించి తనను రాజకీయంగా బలహీన పరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఎన్నికల ప్రచార సభల్లో రేవంత్రెడ్డి వ్యాఖ్యానించడం ఆయన ఎదుర్కొంటున్న ఒత్తిడికి నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహబూబ్నగర్, నాగర్కర్నూల్, మల్కాజిగిరి సీట్లను గెలుచుకోలేకపోతే, అధిష్ఠానం దగ్గర తన పలుకుబడి తగ్గిపోతుందని, పార్టీలో ఇమేజ్ మసకబారిపోతుందనే ఆందోళనలో రేవంత్రెడ్డి ఉన్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలపై రేవంత్రెడ్డికి రోజురోజుకు నమ్మకం సన్నగిల్లడానికి మరో కారణం బీఆర్ఎస్కు లభిస్తున్న అనూహ్య స్పందన. గత అసెంబ్లీ ఎన్నికల్లో ముఖాముఖి తలపడ్డ బీఆర్ఎస్, కాంగ్రెస్కు మధ్య స్వల్ప ఓట్ల తేడా మాత్రమే నమోదైంది. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ కనిపిస్తున్నది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు అనూహ్య స్పందన వస్తుండటంతో అధికార కాంగ్రెస్కు ముఖ్యంగా సీఎం రేవంత్రెడ్డికి ముచ్చెమటలు పడుతున్నాయి.
త్రిముఖ పోటీలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలుస్తామన్న ధీమా కాంగ్రెస్లో లేకుండా పోయింది. దీనికితోడు రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కారణమైన ఆరు గ్యారెంటీల అమలులో ఘోరంగా వైఫల్యం చెందడం, దీనినే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రధాన అస్త్రంగా మలుచుకోవడంతో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. ‘బీఆర్ఎస్ హయాంలోనే అంతా బాగుండేది’ అన్న అభిప్రాయం ప్రజల్లో రోజురోజుకీ బలపడుతున్నది. నిజంగా ఇది రేవంత్రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి మింగుడుపడని పరిణామమే.
ఎవరికి వారే యమునా తీరే
పార్టీలో పలువురు సీనియర్లు సీఎం పదవి ఆశించేవారే తప్ప, ఎంపీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని, పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను భుజస్కంధాలపై వేసుకునే వారే లేకుండా పోయారని రేవంత్రెడ్డి తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు సమాచారం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన భార్యకు ఎంపీ టికెట్ రాలేదన్న అసంతృప్తితో ఖమ్మం నియోజకవర్గానికే పరిమితమై మొక్కుబడిగా ప్రచారం చేస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.
సమయం చిక్కినప్పుడు ఆయన కేరళ, ఒడిశా రాష్ర్టాలకు వెళ్లి పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారే తప్ప రాష్ట్రంలో మిగతా ఎంపీ స్థానాల వైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శ ఉన్నది. మరో సీనియర్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నల్లగొండ నియోజకవర్గం దాటి బయటకు రావడం లేదు. మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించినప్పటికీ, భువనగిరి నియోజకవర్గానికే పరిమితమయ్యారు.
తమ సొంత రాజకీయ పలుకుబడి కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ భువనగిరి సీటు గెలిపించుకునేందుకు తంటాలు పడుతున్నారు. మిగతా మంత్రులదీ అదే పరిస్థితి. దీంతో సీఎం రేవంత్రెడ్డి కూడా తన సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్లోని రెండు ఎంపీ సీట్లతోపాటు తన సిట్టింగ్ స్థానం మల్కాజిగిరిని నిలబెట్టుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పర్యటనలకు వెళ్లి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కలియతిరిగి వస్తున్నారు.
‘మీ జిల్లా బిడ్డకు సీఎం అయ్యే అవకాశం తొలిసారి వచ్చింది. దానిని కాపాడుకోవడం మీ అందరి బాధ్యత’ అంటూ సెంటిమెంట్ గాలం వేస్తున్నారు. తనను సీఎం సీట్లోంచి దించేస్తారట అంటూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో రెండు ఎంపీ సీట్లు గెలిపిస్తే మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇస్తానని జిల్లాలో అత్యధికంగా ఉన్న ముదిరాజ్ బీసీ సామాజికవర్గానికి గాలం వేసే ప్రయత్నం చేస్తున్నారు. తనకు అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్రెడ్డికి మహబూబ్నగర్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించి అన్ని శక్తులు ధారపోస్తున్నారు.