హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రేవంత్రెడ్డి సర్కారు అప్పుల పరంపరను కొనసాగిస్తున్నది. రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి తాజాగా మరో రూ.1,000 కోట్లు అప్పు తీసుకున్నది. మంగళవారం నిర్వహించిన బహిరంగ ఈ వేలంలో పాల్గొని ఈ మొత్తం సేకరించినట్టు ఆర్బీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. 30 ఏండ్ల కాలానికి 7.13 శాతం వార్షిక వడ్డ్డీకి రూ.1,000 కోట్లు రుణం తీసుకున్నట్టు పేర్కొన్నది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.14 వేల కోట్ల రుణం కోసం ఆర్బీఐకి కాంగ్రెస్ సర్కారు ప్రతిపాదనలు పంపి, అంతకుమించి రూ.17,400 కోట్ల రుణ సమీకరణ చేసింది.
జూన్ 27న రెండో త్రైమాసికం కింద మరో రూ.12,000 కోట్ల రుణ సమీకరణ కోసం ఆర్బీఐకి ఇండెంట్ పెట్టింది. గత మంగళవారం సెక్యూరిటీ బాండ్ల ద్వారా రూ.1,500 కోట్లు, ఈ మంగళవారం రూ.1,000 కోట్లు అప్పు తీసుకున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ రుణాల కింద రూ.64,539 కోట్లు సమీకరిస్తామని బడ్జెట్లో ప్రతిపాదించారు.