హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): అప్పులు తేవడంలో రేవంత్రెడ్డి సర్కారు సరికొత్త రికార్డు సృష్టిస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలలు పూర్తిగాకముందే బడ్జెట్ రు ణ సమీకరణ అంచనాలో 75 శాతానికి చేరింది. ఇప్పటికే రూ.40 వేల కోట్ల వరకు అప్పులు సేకరించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తాజాగా మరో రూ.1000 కోట్ల రుణ సమీకరణ కోసం ఆర్బీఐకి ఇండెంట్ పెట్టింది. రిజర్వు బ్యాంకు ప్రతి మంగళవారం నిర్వహించే ఈ-వేలంలో పాల్గొని ఈ నెల 16న ఈ మొత్తాన్ని సేకరిస్తామని పేర్కొన్నది. 28 ఏండ్ల కాలానికి రూ.1,000 కోట్ల రుణ సమీకరణ కోసం సెక్యూరిటీ బాండ్లు పెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ రుణాల కింద రూ.54,009 కోట్లు సమీకరిస్తామని కాంగ్రెస్ సర్కారు బడ్జెట్లో ప్రతిపాదించింది. కానీ, ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలలు గడువక ముందే ఒక్క ఆర్బీఐ నుంచే సుమారు రూ.41,000 కోట్ల అప్పుచేసింది. అర్ధ ఆర్థిక సంవత్సరానికి 75శాతానికిపైగానే రుణ సమీకరణ చేసింది. బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం ఓపెన్ మార్కెట్లో సేకరించాల్సిన అప్పు ఇక రూ.13 వేల కోట్లు మాత్రమే మిగిలింది. కాంగ్రెస్ సర్కారు ఆదాయ రాబడిలో 25 శాతం దాటడం లేదు.. కానీ, అప్పుల సేకరణలో మాత్రం 75శాతానికి చేరడంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.