Telangana | హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం.. తాజాగా రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) నుంచి మరో రూ.1,500 కోట్లు అప్పు తెచ్చింది. మంగళవారం నిర్వహించిన సెక్యూరిటీ బాండ్ల వేలంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణాన్ని సమీకరించినట్టు ఆర్బీఐ వెల్లడించింది. 24 ఏండ్ల కాలపరిమితితో 7.14% వార్షిక వడ్డ్డీకి రూ.800 కోట్లు, 30 ఏండ్ల కాలపరిమితితో 7.14% వడ్డీకి మరో రూ.700 కోట్లు రుణం తీసుకున్నట్టు వివరించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో మార్కె ట్ రుణాల ద్వారా రూ.64,539 కోట్లు సమీకరిస్తామని బడ్జెట్లో ప్రతిపాదించిన రేవంత్రెడ్డి సర్కారు.. తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో రూ.14 వేల కోట్ల రుణం కోసం ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపింది. కానీ, అంతకంటే రూ.3,400 కోట్లు అధికంగా రూ.17, 400 కోట్ల అప్పు తెచ్చింది.
ఇది వార్షిక రుణ ప్రతిపాదనలో 26.96 శాతానికి సమానం. కాగా, రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో రూ.12,000 కోట్ల రుణ సమీకణ కోసం గత నెల 27న ఆర్బీఐకి ఇండెంట్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. అందులో భాగంగానే మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రూ.1,500 కోట్ల అప్పు తీసుకున్నది.