Cabinet Meeting | హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనున్నది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున క్యాబినెట్ భేటీ ఎజెండాను ఈసీకి ప్రభుత్వం పంపించింది. ఈసీ నుంచి అనుమతి వస్తే మధ్యాహ్నం మంత్రిమండలి సమావేశం కానున్నది. భేటీలో పలు ప్రధాన అంశాలపై మంత్రిమండలి చర్చించనున్నది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి చెందిన పలు అంశాలపై క్యాబినెట్లో చర్చించనున్నారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, వానకాలం పంటల ప్రణాళికపై చర్చ జరుగనున్నది. రాష్ట్ర ఆదాయం పెంపు దిశగా వనరుల సమీకరణ, ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించనున్నారు.
మేడిగడ్డ, అన్నారం బరాజ్ల మరమ్మతుల కోసం ఎన్డీఎస్ఏ ఇటీవలే ఇచ్చిన మధ్యంతర నివేదికలోని సిఫారసులు, తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. పాఠశాలలు, కళాశాలల ప్రారంభానికి ముందే విద్యార్థుల నమోదు, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం పంపిణీ తదితర అంశాలపై విధివిధానాలు నిర్ణయిస్తారు. జూన్ 2తో రాష్ట్ర విభజన జరిగి పదేండ్లు పూర్తవుతున్నది. ఈ నేపథ్యంలో విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలపై, తెలంగాణ, ఏపీ మధ్య అపరిషృత అంశాలపై చర్చించి, వాటిని పరిష్కరించే ప్రణాళికలు రూపొందించనున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎన్నికకు మరోసారి పేర్లను ప్రతిపాదించే అంశంపైనా మంత్రిమండలి సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నది.