Revanth Reddy | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 23 (నమస్తే తెలంగాణ): కొండంత రాగం తీసి ఏదో పాట పాడిన చందంగా ఉన్నది టీపీపీసీ చీఫ్ రేవంత్రెడ్డి తీరు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై నోటికొచ్చినట్టు మాట్లాడిన రేవంత్.. సిట్ ముందు ఒక్క ఆధారం కూడా సమర్పించకుండా తోక ముడిచారు. మీడియా ముందు తెగ ఆరాటం చేసి ఆధారాల వరకు వచ్చేసరికే చేతులెత్తేశారు. సమాచారం ఇవ్వకుండాఅధికారుల సమయాన్ని వృథా చేయడం, తప్పుడు ఆరోపణలతో దర్యాప్తును తప్పుదోవ పట్టించడం వంటి కారణాల దృష్ట్యా రేవంత్పై కేసు నమోదు చేసే యోచనతో పోలీసులు న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. పేపర్ లీకేజీ విషయాన్ని సీరియస్గా తీసుకొన్న ప్రభుత్వం దర్యాప్తును సిట్కు అప్పగించింది. కానీ, ప్రభుత్వంపై బురద జల్లాలనే ఉద్దేశంతో రేవంత్ తప్పుడు ఆరోపణలు చేశారు.
‘మాకు అందిన సమాచారం ప్రకారం గ్రూప్-1 పరీక్షలు రాసినవారిలో దాదాపు వంద మందికి 103 మార్కుల కంటే ఎక్కువగా వచ్చాయి. వీరంతా పేపర్ లీకేజీలో అరస్టైయిన రాజశేఖర్రెడ్డి మండలానికి చెందిన వారే’ అని రేవంత్రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ‘మీ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు మాకు ఇవ్వాలి. ఇది దర్యాప్తుకు ఎంతో సహకరిస్తుంది. ఈ నెల 23న సిట్ ముందు హాజరుకావాలి’ అంటూ రేవంత్రెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. దీంతో రేవంత్రెడ్డి గురువారం మధ్యాహ్నం మంది మార్బలంతో హిమాయత్నగర్లోని సిట్ కార్యాలయానికి వచ్చారు. ముందస్తు ప్లాన్ ప్రకారం తమ కార్యకర్తలు, నాయకులను సిట్ వద్దకు పంపించి హడావుడి చేశారు.
ఎన్నో ఆధారాలు ఇస్తారని, వాటితో కేసు మరింత లోతుగా దర్యాప్తు చేయవచ్చనే ఆలోచనతో ఉన్న సిట్కు రేవంత్ షాక్ ఇచ్చారు. ఈ నెల 18న మంత్రి కేటీఆర్ ప్రెస్మీట్కు సంబంధించిన పేపర్ కటింగ్స్ను జోడించి, అవే ఆధారాలంటూ తుస్ మనిపించారు. సిట్ ఆఫీసులో గంటపాటు ఉన్న రేవంత్.. దర్యాప్తుకు పనికొచ్చే ఒక్క సమాచారం ఇవ్వకుండా బయటకొచ్చి, 40 నిమిషాలు విలేకరులతో మాట్లాడారు. అక్కడ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు తప్ప.. అవసరమైన విషయం చెప్పలేదు. మంత్రి కేటీఆర్ ఈ నెల 18న మీడియాకు వెల్లడించిన అంశాలకు సంబంధించిన ఇంగ్లిష్, తెలుగు పత్రికల క్లిప్పింగ్లను సిట్ అధికారులకు ఇచ్చానని రేవంత్ తెలిపారు. సమాచారం అంతా కేటీఆర్కు తెలుసుని ఆయనకు నోటీసు ఇవ్వాలంటూ మళ్లీ పాత పాటే పాడారు. టీఎస్పీఎస్సీలో కీలక పోస్టు ఆంధ్రకు చెందిన ప్రవీణ్ చేతిలో ఉన్నదని, దాంతోనే లీక్ చేశాడని, ఇప్పుడు సిట్ అధికారి కూడా ఆంధ్ర అంటూ ప్రాంతీయ భేదాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.