ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తాము ఇన్చార్జీలుగా కొనసాగుతున్న పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతల నుంచి తప్పుకోవడం కాంగ్రెస్ పార్టీలో హాట్టాపిక్గా మారింది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కాస్త అటు, ఇటు అయితే తమ పదవులకే ఎసరు వస్తుందన్న భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
CM Revanth Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని సికింద్రాబాద్ ఇన్చార్జిగా వ్యూహత్మకంగా ఇరికించడంలోనూ సీఎం, డిప్యూటీ సీఎం కృతకృత్యులైనట్టు పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. వాస్తవానికి మూడు నెలల కిందట ఇన్చార్జీలను నియమించినప్పుడు భువనగిరి నియోజకవర్గ బాధ్యతలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి అప్పగించారు. అక్కడ ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నందున దానిని సరైన నిర్ణయంగానే భావించారు. అయితే, తాజా నియామకాల్లో వెంకట్రెడ్డికి బదులుగా భువనగిరి ఇన్చార్జిగా ఆయన సోదరుడు రాజగోపాల్రెడ్డిని నియమించడం ఒక పథకం ప్రకారం జరిగినట్టుగా పార్టీలో చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, మెజార్టీ పార్లమెంట్ స్థానాలు గెలుచుకునే వ్యూహంతో మూడు నెలల కిందట నియోజకవర్గాలకు ఇన్చార్జీలను నియమించింది. మంత్రులతోపాటు సీఎం, డిప్యూటీ సీఎంను కూడా ఇన్చార్జీలుగా బాధ్యతలు అప్పగించింది. సీఎం రేవంత్రెడ్డిని మహబూబ్నగర్, చేవెళ్ల ఇన్చార్జిగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను హైదరాబాద్, సికింద్రాబాద్ ఇన్చార్జిగా నియమించింది.
ఎన్నికల వ్యూహంపై నియోజకవర్గాల ముఖ్యనేతలతో వీరు సమీక్షలు కూడా నిర్వహించారు. తాము ఇన్చార్జీలుగా ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ ఓటమి పాలైతే తమ పదవులకే ఎసరు వచ్చే ప్రమాదం ఉన్నదని భావించే సీఎం, డిప్యూటీ సీఎం ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, వీరి సన్నిహితులు మాత్రం వేరే కారణం చెప్తున్నారు. కీలక బాధ్యతల్లో ఉన్న సీఎం, డిప్యూటీ సీఎంను కేవలం రెండు నియోజకవర్గాల ఇన్చార్జీలుగా పరిమితం చేయకుండా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను పర్యవేక్షించే విధంగా అధిష్ఠానం వెసులుబాటు కల్పించిందని వీరి సన్నిహితుల వాదన.
మంత్రి కోమటిరెడ్డికి చెక్
సీఎం రేవంత్రెడ్డి ఇన్చార్జీగా ఉన్న మహబూబ్నగర్ నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ సెక్రటరీ సంపత్కుమార్ను, చేవెళ్లకు సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డిని, డిప్యూటీ సీఎం భట్టి ఇన్చార్జిగా ఉన్న సికింద్రాబాద్కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని, హైదరాబాద్కు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ను ఇన్చార్జీలుగా నియమించింది. నియోజకవర్గాల ఇన్చార్జి బాధ్యతల నుంచి సీఎం, డిప్యూటీ సీఎం తప్పుకోవడం ఒక ఎత్తుగడ అయితే, వెంకట్రెడ్డికి చెక్ పెట్టడం రెండో ఎత్తుగడ అయి ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ను కూల్చడానికి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఏక్నాథ్షిండే పాత్ర పోషించడానికి తమతో సంప్రదింపులు జరిపారని బీజేపీ శాసనసభాపక్షం నేత మహేశ్వర్రెడ్డి బయటపెట్టిన 24 గంటల్లోనే ఆయనను సికింద్రాబాద్ ఇన్చార్జిగా నియమించడం గమనార్హం. ఈ నియామకంలో ఒకే దెబ్బకు రెండు పిట్టల వ్యూహం దాగి ఉన్నదని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. మంత్రి కోమటిరెడ్డి భవిష్యత్తులో ఏక్నాథ్ షిండేగా మారే అవకాశం లేకుండా ఆదిలోనే చెక్ పెట్టడం ఒకటైతే, సికింద్రాబాద్ అభ్యర్థిగా పోటీచేస్తున్న కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి నియోజకవర్గానికే ఈయనను ఇన్చార్జీగా నియమించడం ద్వారా దొంగ చేతికే తాళం చెవి ఇచ్చినట్టు అవుతుందన్నది రెండో ఎత్తుగడగా కాంగ్రెస్ రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.