నిజామాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పోచారం శ్రీనివాసరెడ్డి ఒక శాసనసభాపతి. రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. ఆయన రాజకీయ అనుభవమంత వయసు లేదు రేవంత్రెడ్డికి. నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి.. పీసీసీ హోదాలో వారం రోజులుగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో నిర్వహించిన హాథ్సే హాథ్ జోడోయాత్రలో భాగంగా పోచారం శ్రీనివాసరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వయసు, హోదా చూడకుండా.. సభ్యత, విజ్ఞతను మరిచిపోయి.. నోటికొచ్చినట్టు మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధికి నమూనాగా మారిన బాన్సువాడలో అభివృద్ధే జరగడం లేదంటూ రేవంత్ వ్యాఖ్యానించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు రేవంత్ వ్యాఖ్యలను నిరసిస్తూ.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించి రేవంత్ దిష్టిబొమ్మలను దహనం చేశాయి. అభివృద్ధిపై అసత్య ప్రచారం చేస్తున్నారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అపారమైన రాజకీయ అనుభవం కలిగిన పోచారం శ్రీనివాసరెడ్డి పనితీరును మెచ్చి 2018 ఎన్నికల సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా లక్ష్మీపుత్రుడని పేరు పెట్టారు. ప్రజల మనిషి అంటూ కీర్తించారు. బాన్సువాడలో ఇప్పటి వరకు 11 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయగా, 7 వేల ఇండ్లను పూర్తి చేసి పేద ప్రజలకు పంపిణీ చేశారు. లక్కీ డ్రా రూపంలో పారదర్శకంగా అర్హులను గుర్తించి అందజేశారు. మిగిలిన 4 వేల ఇండ్లు శరవేగంగా నిర్మితమవుతున్నాయి. గిరిజన రైతుల కోసం రూ.150 కోట్లతో జాకోరా-చందూర్, రూ.200 కోట్లతో సిద్దాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్లను చేపడుతున్నారు. నర్సింగ్ కళాశాల, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలతోపాటు ఆకర్షణీయమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు నెలకొల్పి బాన్సువాడను పోచారం ఎడ్యుకేషన్, హెల్త్ హబ్గా మార్చారు. బాన్సువాడలో 40 వేల మందికి పింఛన్లు అందుతున్నాయి. శాశ్వత భవనాలతో రాష్ట్రంలోనే ఈ నియోజకవర్గం ఆదర్శంగా నిలిచింది.
చెక్డ్యామ్ల నిర్మాణానికి రూ.135 కోట్లు, బాన్సువాడ పట్టణ అభివృద్ధికి రూ.125 కోట్లు వెచ్చించారు. ఇలా సుమారుగా రూ.10 వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో జరగడం విశేషం. ఏ హోదాలో పని చేసినా బాన్సువాడ ఎమ్మెల్యేగా పోచారం శ్రీనివాసరెడ్డి తన అమూల్యమైన సమయాన్ని ఈ ప్రాంత ప్రజలకే కేటాయిస్తారు. దేశ, విదేశాల పర్యటనల్లో ఉన్నప్పటికీ వీడియో కాన్ఫరెన్సులు ఏర్పాటు చేసి ప్రజలతో ముఖాముఖి నిర్వహించిన సందర్భాలు అనేకం. కరోనా సమయంలో అడుగు బయట పెట్టాలంటేనే జంకిన సందర్భాల్లోనూ.. నాలుగు సార్లు కరోనా బారిన పడినప్పటికీ ప్రజల యోగక్షేమాల కోసం ధైర్యంగా క్షేత్ర పర్యటనలు చేశారు. పోచారంపై రేవంత్ ఏక వచనంతో వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ నాయకులే తప్పుబడుతున్నారు. సభ్యతలేని వ్యక్తులకు పీసీసీ బాధ్యతలు ఇస్తే గిట్లనే ఉంటదంటూ గుసగుసలాడుతున్నారు. పీసీసీ చీఫ్ హోదాలో ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా, పరిస్థితులపై అవగాహనతో మాట్లాడాలని సూచిస్తున్నారు.
అభివృద్ధిలో బాన్సువాడ నియోజకవర్గం రాష్ట్రంలో ముందంజలో ఉంది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక కృషితో ఇప్పటికే సుమారు 1000 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి పేదలకు పంపిణీ చేశారు. నేను కూడా ఇల్లు పొందాను. అలాంటి ఒక మహా నాయకుడి గురించి ఇష్టారీతిన మాట్లాడిన రేవంత్రెడ్డికి మతి భ్రమించింది. నేను గనుక అక్కడ ఉండి ఉంటే ఎడమకాలు చెప్పుతో కొట్టి సమాధానం చెప్పేదాన్ని.
-రేఖ, గృహిణి, బాన్సువాడ
బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో ప్రతి ఇంటికీ స్పీకర్ కుటుంబ సభ్యులు ఏదో రకంగా అండగా నిలుస్తున్నారు. బాన్సువాడను మించిన అభివృద్ధిని ఇంకేదైనా నియోజకవర్గంలో చూపిస్తే ఇక్కడి చౌరస్తాలో గుండు కొట్టుకుంటా. అభివృద్ధి జరిగినట్టు నిరూపిస్తే రేవంత్రెడ్డి గుండు కొట్టుకోవాలి. రేవంత్కు సిగ్గు ఉంటే నా సవాలును స్వీకరించాలి.
-దోన్కంటి పెద్ద సాయిలు, రైతు, బాన్సువాడ