(స్పెషల్ టాస్క్ బ్యూరో)/హైదరాబాద్, మే14(నమస్తే తెలంగాణ) : ‘సినిమా తారలైనా, రాజకీయ నాయకులైనా చట్టం ముందు అందరూ సమానమే’.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి అసెంబ్లీలో మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. కానీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో మాత్రం రేవంత్ సర్కార్ వైఖరి ‘మాటలకే పరిమితం.. చేతల్లో శూన్యం’ అన్నట్టు ఉన్నదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆరు రోజులైనా నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం, ప్రజాగ్రహం పెల్లుబుకిన తర్వాతే ప్రత్యేక దర్యాప్తు అధికారిని ప్రభుత్వం నియమించడం, పోలీసుల విచారణ హాజరుకాకపోయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని గమనిస్తే నిందితుడు భగీరథ్ను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు నెటిజన్లు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
ఇదే సమయంలో కర్ణాటకలో సంచలనం రేపిన ప్రజ్వల్ రేవణ్ణ రేప్ కేసును ఉదహరిస్తున్నారు. ఆ కేసులో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం వాయువేగంతో స్పందించి, దోషికి శిక్ష వేయించిందని.. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిందితులను తప్పించేలా వ్యవహరిస్తున్నదని మండిపడుతున్నారు. మొత్తంగా కర్ణాటకలో ఒరిజినల్ కాంగ్రెస్ ఉంటే, ఇక్కడ డూప్లికేట్ కాంగ్రెస్ పాలన కొనసాగుతున్నదని చురకలు అంటిస్తున్నారు. పనిమనిషిపై రెండుమార్లు లైంగికదాడికి పాల్పడిన కేసులో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, ఎన్డీయే కూటమిలోని జేడీఎస్ నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం ఆయన జైలులోనే ఉన్నారు.
అయితే, ప్రజ్వల్పై ఆరోపణలు బయటకు వచ్చిన వెంటనే ఈ కేసును సీరియస్గా తీసుకొన్న కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. జర్మనీ నుంచి వచ్చిన వెంటనే ఆయన్ను అరెస్ట్ చేసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా సాక్ష్యాధారాలను సేకరించి కోర్టులో శిక్ష పడేలా చేసింది. అయితే, బాలికపై వేధింపులకు పాల్పడి, పోక్సో కేసును ఎదుర్కొంటున్న బండి సంజయ్ కుమారుడి విషయంలో ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోకుండా చేతులెత్తేసిందని పలువురు నెటిజన్లు, హక్కుల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కర్ణాటక తరహాలోనే బండి సంజయ్ కొడుకు కేసులో ఇక్కడి కాంగ్రెస్ సర్కార్ ఎందుకు నిబద్ధతతో పనిచేయడం లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.