సంగారెడ్డి, ఏప్రిల్ 13(నమస్తే తెలంగాణ)/దుబ్బాక : పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మిలాఖత్ అయ్యాయని, బీజేపీకి మేలు జరిగేలా కాంగ్రెస్ బలహీన అభ్యర్థులను బరిలో నిలిపిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు. శనివారం సంగారెడ్డిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతన, దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ యువ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. పటాన్చెరులో ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి అధ్యక్షతన ఎంపీ ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాలకు మెదక్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి హరీశ్రావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ టికెట్ను సర్పంచ్గా పని చేసిన వ్యక్తికి ఇచ్చిందని అన్నారు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్లలో వీక్ క్యాండెట్లను కాంగ్రెస్ బరిలో నిలిపిందని విమర్శించారు. కరీంనగర్లో ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ మిలాఖత్ అయినా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
సెక్యులర్ పార్టీ బీఆర్ఎస్ ఎప్పటికీ బీజేపీతో కలిసి పనిచేయదని స్పష్టం చేశారు. కేంద్రంలో పదేండ్లు అధికారంలో ఉన్న బీజేపీ పాలనలో పేదరికం, ధరలు, నిరుద్యోగం పెరిగాయి తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగులు భర్తీ చేస్తామన్న బీజేపీ పదేండ్లలో 20 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉన్నా, 6.50 లక్షల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసి యువతను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ రాముడు పేరు చెప్పి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినన్ని యజ్ఞాలు, హోమాలు దేశంలో ఏ నాయకుడు చేయలేదని అన్నారు. యాదాద్రి దేవాలయ నిర్మించిన ఘనత మన కేసీఆర్ది కాదా అని ప్రశ్నించారు. యువత బీజేపీ మత రాజకీయాలకు మోసపోకుండా తెలంగాణ కోసం అండగా నిలిచే బీఆర్ఎస్కు ఓటువేసి గెలిపించాలని హరీశ్రావు కోరారు.
రైతులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవటంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని, రైతు హామీలపై బహిరంగ చర్చకు రేవంత్రెడ్డి సిద్ధమా అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు సవాల్ విసిరారు. రూ.2 లక్షల రుణమాఫీ, రూ.15వేల రైతుబంధు, కౌలురైతులకు రూ.15వేలు, రైతు కూలీలకు రూ.12వేలు ఇవ్వలేదని మండిపడ్డారు. వరి ధాన్యం, మక్కలకు రూ.500 బోనస్ ఇవ్వటంలేదని, రూ.4వేల పింఛన్, నిరుద్యోగభృతి, మహాలక్ష్మి పథకం అమలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ తనను ఎంపీగా గెలిపిస్తే రూ.100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేసి ప్రతి ఏడాది రూ.20 కోట్లు పేద పిల్లల విద్య కోసం ఖర్చు చేస్తానని తెలిపారు. సమావేశాల్లో సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, గూడెం మహిపాల్రెడ్డి, కొత్త ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె.సత్యనారాయణ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, బుచ్చిరెడ్డి, దేశ్పాండే, నరహరిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రొట్టె రాజమౌళి, మనోహర్రావు, కత్తి కార్తీక, యువ నాయకులు చింతా సాయి, శేఖర్గౌడ్, సురేశ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.