Congress | హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు కాంగ్రెస్లో ఆధిప త్యం చెలాయించి ఏ ఎన్నికల్లోనైనా టికెట్టు సాధించుకున్న బీసీ నేతలు, ఇప్పుడు టికెట్టు కోసం ఢిల్లీ చుట్టూ తిరగాల్సిన దుస్థితి వచ్చింది. సీనియర్లు, పార్టీ కోసం సర్వం ధారపోసిన వారిని జాగ్రత్తగా పక్కకు తప్పించి ప్రస్తుత పార్టీ నాయకత్వం తమతోపాటు తెచ్చుకొన్న కొత్తవారిని రంగంలోకి దింపుతున్నది. ప్రజల్లో ఉన్న, పార్టీ కోసం పనిచేసిన హేమాహేమీల్లాంటి వా రిని కాదని డబ్బున్నవారికి పెద్దపీట వేస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నా యి. అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాలో కొత్త కొత్తవాళ్లు చేరిపోతుండడంతో పాత నేతలు బిత్తరపోతున్నారు. వలస నేతలు వచ్చి తమకే టికెట్లు వస్తాయని ప్రకటిస్తుండటంతో ఖిన్నులవుతున్నారు.
వలస నేతలదే రాజ్యం
రాష్ట్ర కాంగ్రెస్లో ఇప్పుడు వలస నేతల రాజ్యమే నడుస్తున్నదని ఆ పార్టీ పాత తరం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి నియోజకవర్గాలను పట్టుకొని ఉంటున్న తమను కాదని కొత్తవారికి టికెట్లు ఇస్తామని చెప్పడంలో ఆంతర్యమేంటని నిలదీస్తున్నారు. ఎప్పటి నుంచో నియోజకవర్గంలో పనిచేస్తున్న తమకు సర్వేల్లో మెజార్టీ రాదని చెప్తున్నారని, మరి ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచో వచ్చేవారికి మెజార్టీ ఎలా వస్తున్నదని ప్రశ్నిస్తున్నారు. సర్వేలపై తమకు నమ్మకం లేదని, ఏ ప్రాతిపదికగా సర్వేలు చేస్తున్నారో అర్థం కావడంలేదని చెప్తున్నారు. సీనియర్ బీసీ నేత లు ఉన్నచోటనే ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు సృష్టిస్తున్నారని, ఈ ఎన్నికల్లో వారికి టికెట్లు రాకపోతే ఇక వారికి రాజకీయ జీవితమే ఉండదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా రాష్ట్ర కాంగ్రెస్లోని బీసీ నేతలు ఏకమవుతున్నారు. కొన్ని రోజులుగా వారు ఢిల్లీలో పార్టీ అధిష్ఠానం చుట్టూ తిరుగుతున్నారు. పార్టీలో సీనియర్లను పక్కకు తప్పించి తనకు ఎదురులేకుండా చేసుకొనేందుకు పీసీసీ ముఖ్యనేత స్కెచ్ వేస్తున్నారని, కొత్తవారిని తీసుకొచ్చి సీనియర్ నేతలను పక్కకు నెట్టివేస్తున్నారని చెప్తున్నారు.