Telangana | హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై కాంగ్రెస్, బీజేపీలు సృష్టిస్తున్న కల్లోల పరిస్థితులతో కలత చెందుతున్న ఉద్యమశక్తులు తిరిగి ఏకవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు అసలైన రక్షణ అని భావించిన ఉద్యమకారులు, నాయకులు తిరిగి తమ సొంతగూటికి చేరుతున్నారు. పలు కారణాల వల్ల ఇతర పార్టీల్లోకి వెళ్లిన ఉద్యమకారులు, బుద్ధిజీవులు తెలంగాణ ఉద్యమం, బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.
ఇతర పార్టీల్లో చేరిన తరువాత వాటి నాయకుల్లో ఉన్న కుత్సిత బుద్ధితో ఏకీభవించని సందర్భాలే అధికంగా ఉన్నాయని తిరిగి బీఆర్ఎస్లో చేరిన ఒక నేత పేర్కొన్నారు. తమ ప్రతిభ, అనుభవం, తమకున్న ప్రజాదరణ వంటివేవీ పట్టించుకోకుండా ద్వితీయశ్రేణి పౌరుల కింద జమ కడుతారని సదరునేత తెలిపారు. ఈ క్రమంలోనే తాము తిరిగి తమ సొంతగూటికి, మాతృసంస్థకు వస్తున్నామని అన్నారు.
కేసీఆర్కు ప్రత్యామ్నాయం లేదు
బీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్కు ప్రత్యామ్నాయం ఎవరూలేరని, తెలంగాణ నేల అణువణువు తెలిసిన, ప్రజల అవసరాలు గుర్తించి వారిని కడుపులో పెట్టుకొని చూసే నేత ఒక్క కేసీఆర్ మాత్రమేనని ఇటీవల తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రజాకళాకారుడు ఏపూరి సోమన్న వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీలు మరికొన్ని పార్టీలతో కలిసి తెలంగాణ ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నాయని ఉద్యమశక్తులు గుర్తించాయి. సాధారణ సందర్భాల కన్నా ఎన్నికల సమయంలో ఆయా పార్టీల నేతలు తమ అసలు ఎజెండాను పక్కనబెట్టి కేసీఆర్ను దెబ్బకొడితే ఇక తమకు తిరుగే ఉండదని చేస్తున్న కుట్రలపై కరుడుగట్టిన ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల బతుకు చిత్రాన్ని మార్చటం కోసం దశాబ్దాలపాటు పోరాడి, రాష్ర్టాన్ని సాధించుకొని ఒక్కోరంగం ఒక్కోమెట్టు ఎక్కి మొఖం తెల్లబడుతుందనగానే అందరికండ్లు తెలంగాణ మీద పడ్డాయని వారు మండిపడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ను వీడి ఇతర పార్టీల్లో చేరిన నేతలు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఏమాత్రం ఒప్పుకోకుండా రక్షణకవచంగా నిలబడిన కేసీఆర్కు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. మొదటి నుంచి సీఎం కేసీఆర్తో, బీఆర్ఎస్తో పనిచేసి కాంగ్రెస్, బీజేపీల్లో చేరిన నేతలు తిరిగి తమ సొంత ఇంటికి వస్తున్నారు.
గత ఏడాది మునుగోడు ఉపఎన్నికల సమయంలో రాష్ట్ర శాసనమండలి తొలి చైర్మన్, టీఎన్జీవోలను తెలంగాణ ఉద్యమంలో నడిపించిన నాయకుడు స్వామిగౌడ్, బీఆర్ఎస్ పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడిగా, అధికార ప్రతినిధిగా వ్యవహరించిన ఉద్యమకారుడు దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన పల్లె రవి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఇంకా అనేక మంది నాయకులు తమ మాతృసంస్థలో పనిచేయటానికి సన్నద్ధం అవుతున్నారని గురువారం జరిగిన పరిణామం స్పష్టం చేసింది. మంత్రులు కేటీఆర్, హరీశ్రావుతో తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ యువత పార్టీ స్థాపకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి భేటీ అయ్యారు.
శుక్రవారం ఆయన తిరిగి పార్టీలో చేరనున్నారు. వీరితోపాటు కేసీఆర్కు అత్యంత ఆప్తుడిగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పేరున్న ఉద్యమనాయకుడు చెరుకు సుధాకర్, మేడ్చల్ జిల్లాకు చెందిన నేత హరివర్ధన్రెడ్డి తదితరులు తిరిగి బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధం అవుతున్నారు. మొత్తంగా మంటి పనికైనా ఇంటోడే కావాలి అన్నట్టు మన ఇల్లును మనం చక్కదిద్దుకోవాలంటే మనవాడితో భుజం కలిపితేనే మనకు మంచిదని భావించి తిరిగి గులాబీ గూటికి చేరుతుండటం తెలంగాణ విజయంగా ఉద్యమకారులు పేర్కొంటున్నారు.