హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సర్కారు స్కూళ్లలోని విద్యార్థులకు ఉచితంగా అందించే యూనిఫారాలను కుట్టించే బాధ్యతను విద్యాశాఖ మహిళా సంఘాలకు అప్పగించింది. మొత్తం యూనిఫారాలను కుట్టే బాధ్యతను స్వయం సహాయక బృందాలకు అప్పగించింది. 2024-25 విద్యా సంవత్సరంలో మొత్తం 21,19,439 విద్యార్థులకు 42,38,878 జతల యూనిఫారాలను అందజేస్తారు. ఒక జతకు రూ.50 కుట్టుకూలీగా చెల్లిస్తారు.
రాష్ట్రంలోని సర్కారు, ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాలు, కేజీబీవీలు, మాడల్ స్కూళ్లు, యూఆర్ఎస్, ఎయిడెడ్ స్కూళ్లలోని విద్యార్థులకు పాలిస్టర్ వస్త్రంతో రూపొందించిన ఉచిత యూనిఫారాలు అందజేస్తారు. స్వయం సహాయక బృందాలను జిల్లా కలెక్టర్లు ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియ మార్చి 15 లోపు పూర్తిచేయాలని విద్యాశాఖ గడువుగా విధించింది. మార్చి 31 లోపు విద్యార్థుల కొలతలు తీసుకుంటారు. జూన్ 1లోపు యూనిఫారాలు కుట్టడం పూర్తిచేయాలని ఆదేశించింది.