Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల అంశంపైనే కాదు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కూడా కాంగ్రెస్ సర్కారు సోయి లేకుండా వ్యవహరిస్తున్నది. ఆది నుంచీ అనాలోచిత నిర్ణయాలతో తెలంగాణ జలహక్కులకు గండికొట్టిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మరోసారి అదే ధోరణి అవలంభిస్తున్నారు. అందుకు కృష్ణా జలాల అంశంపై అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన తాజా తీర్మానమే నిదర్శనం.
ఇదీ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 కథ
వాస్తవంగా నదీ పరిహాక ప్రాంత విస్తీర్ణం, భౌగోళిక పరిస్థితులు అంటే కరువు, వాతావరణం తదితర అంశాల ప్రాతిపదికగా అంతర్రాష్ట్ర నదీవివాదాల చట్టం 1956 సెక్షన్ 3 ప్రకారం ఏర్పాటైన ప్రత్యేక ట్రిబ్యునల్ సదరు నదీ పరివాహాక ప్రాంతాల రాష్ర్టాలకు ఆయా నదీజలాల్లో నీటి వాటాలను కేటాయిస్తుంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని రూపొందించిన కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం ‘మా నీళ్లు మాకే’ అనే తెలంగాణ ఉద్యమ నినాదానికి విలువ లేకుండా చేసింది. సెక్షన్ 3 ప్రకారం కాకుండా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ప్రత్యేకంగా సెక్షన్ 89 నిబంధనను పొందుపరచి దాని ప్రకారం జలాల పంపిణీ చేపట్టాలని నిర్దేశించింది. అప్పటికే ఆయా రాష్ర్టాలు వినియోగంలో ఉన్న నదీ జలాలను మాత్రమే ప్రాజెక్టుల వారీగా పంపిణీ చేయాలని నిర్దేశించింది. అప్పటికే కొనసాగుతున్న బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్కే ఆ బాధ్యతను అప్పగించింది. గడచిన పదేండ్లుగా ఆ ప్రక్రియ కూడా పూర్తికాలేదు. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ సర్కారు కృష్ణా జలాల్లో న్యాయంగా రావాల్సిన 68% వాటాను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అడగలేదంటూ అసెంబ్లీలో గగ్గోలు పెట్టడంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు.
తప్పును కప్పిపుచ్చుకునేందుకు మరో తప్పు
ఉమ్మడి ఏపీ రాష్ర్టానికి బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా జలాల్లో 811 టీఎంసీలను ప్రాజెక్టుల వారీగా కాకుండా ఎన్బ్లాక్గా (గంపగుత్త) కేటాయించింది. కృష్ణా జలాలను ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకుపోవాలనే స్వేచ్ఛను రాష్ర్టాలకు కల్పించింది. దీనిని ఆసరాగా చేసుకునే బేసిన్లోని తెలంగాణ ప్రాంతాన్ని ఎండబెట్టి, రివర్ బేసిన్ అవతలి ప్రాంతాలకు నీటిని తరలించే ప్రాజెక్టులకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జలాలను కేటాయించింది. రాష్ట్ర విభజన నాటికి కృష్ణా జలాల్లో ఏపీ 512 (66%), తెలంగాణ 299 (34%) టీఎంసీలు చొప్పున వినియోగించుకుంటున్నాయంటే ఎంత అన్యాయం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. దానిని సరిదిద్దకుండానే రాష్ట్ర ఏర్పాటు అనంతరం అప్పటికే వినియోగించుకుంటున్న జలాలను 66ః34 నిష్పత్తిలో ఆయా ప్రాజెక్టుల వారీగా కేటాయించాలని ట్రిబ్యునల్ను నాటి కేంద్రంలోని యూపీఏ సర్కారు నిర్దేశించింది. అయితే అప్పటివరకు ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి వినియోగానికి ఏదైనా వర్కింగ్ అరేంజ్మెంట్ ఉండాలి కాబట్టి నాటి బీఆర్ఎస్ సర్కారు ఏపీ సర్కారుతో ఏడాది కాలపరిమితితో తాత్కాలిక ఒప్పందం చేసుకున్నది.
ట్రిబ్యునల్ కేటాయింపులు పూర్తికాకపోవడంతో దానిని ప్రతి నీటి సంవత్సరం పొడగిస్తూ వచ్చింది. 2021 నుంచి తాత్కాలిక ఒప్పందాన్ని ఒప్పుకోబోమని తెగేసి చెప్పింది. ట్రిబ్యునల్ కేటాయింపులు పూర్తయ్యేవరకూ 50ః50 నిష్పత్తిలో జలాలను వినియోగించుకుంటామని తేల్చిచెప్పింది. కానీ నీటి కేటాయింపులకు, షేరింగ్లకు తేడా తెలియకుండా కాంగ్రెస్ సర్కారు అత్యుత్సాహంతో ఇప్పుడు మరో తప్పు చేస్తున్నది. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంలో ఈ అంశాలేవి ప్రస్తావించకుండా గత ప్రభుత్వం 512ః299 టీఎంసీలకు ఒప్పుకున్నదని ప్రకటించింది. అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇది రాబోయే రోజుల్లో ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ వాదనలకు తీవ్ర అవరోధంగా మారే ప్రమాదం ఉన్నదని ఇంజినీర్లు మండిపడుతున్నారు. ఇప్పటికే నాటి తాత్కాలిక ఒప్పందాన్ని, న్యాయస్థానాల్లో ఎక్కడా దానిని ప్రస్తావించవద్దనే షరతులను కూడా ఉల్లంఘించి ట్రిబ్యునల్లో, బోర్డు సమావేశాల్లో ఆధారాలుగా చూపుతూ ఏపీ వాదనలు వినిపిస్తున్నది. ఇప్పుడు ఏకంగా అసెంబ్లీ తీర్మానం చేయడంతో అది కూడా రేపు ఏపీకి అస్త్రంగా మారుతుందని, ఇదీ ప్రభుత్వ పూర్తి అనాలోచిత నిర్ణయమని ఇంజినీర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇకనైనా తప్పులను సరిదిద్దుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పదేండ్లు పోరాడి జలహక్కులను సాధించిన కేసీఆర్
సెక్షన్ 89 ద్వారా తెలంగాణకు ఒరగబోయేది ఏమీ లేదని కేసీఆర్ సర్కార్ ఆది నుంచీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పరివాహాక ప్రాంతం ఆధారంగా నీటివాటాలను తేల్చాలని డిమాండ్ చేసింది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ సర్కారు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. సెక్షన్ 3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి న్యాయమైన నీటి వాటా తేల్చాలని 2014 జూలై14న వినతిపత్రం అందజేశారు. కేంద్రం కాలయాపన చేస్తుండటంతో బీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేసీఆర్ పట్టుబట్టడంతో కేంద్రం దిగొచ్చి ట్రిబ్యునల్ ఏర్పాటుకు అంగీకరించింది. అయితే కొత్త ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలా? లేదంటే ప్రస్తుతం ఉన్న బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్కే సెక్షన్ 3 ప్రకారం నీటి వాటాలు పంపిణీ చేసే అధికారాలను కల్పించాలా? అనేదానిపై న్యాయశాఖ సలహా తీసుకోవాల్సి ఉన్నదంటూ మెలిక పెట్టింది. సుప్రీంకోర్టులో కేసును ఉపసంహరించుకోవాలని, ఆ తర్వాతనే న్యాయసలహా కోరతామని షరతు విధించింది.
దీంతో కేంద్రం సూచనల మేరకు తెలంగాణ ప్రభుత్వం కోర్టు కేసును ఉపసంహరించుకున్నది. అయినప్పటికీ ఏడాదిన్నరపాటు కేంద్రం నుంచి సమాధానం రాకపోవడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేకసార్లు లేఖలు రాసింది. కేసీఆర్ అవిశ్రాంత పోరాటం, రాష్ట్ర ప్రభుత్వ పట్టుదలతో కేంద్రం దిగొచ్చి గత ఏడాది అక్టోబర్ 6న పరివాహక ప్రాంతాల ఆధారంగా న్యాయమైన నీటివాటాలను పంపిణీ చేయాలని బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్కు కొత్తగా మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ విధంగా కాంగ్రెస్ కాలరాసిన జలహక్కులను గత బీఆర్ఎస్ సర్కారు పోరాడి సాధించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అనాడే విభజన చట్టంలో సెక్షన్ 3 ప్రకారం నీటివాటాల పంపిణీ చేపట్టాలని నిర్దేశించి ఉంటే ఈ సమయానికే అది కొలిక్కి వచ్చి, తెలంగాణకు న్యాయం జరిగి ఉండేదని ఇంజినీర్లు చెప్తున్నారు. అయినప్పటికీ ఈ వాస్తవాలన్నీ మరుగున పరచి అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ సర్కారు పచ్చి అబద్ధాలు చెప్పిదంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.