PRLIS | వికారాబాద్, అక్టోబర్ 16, (నమస్తే తెలంగాణ): తెలంగాణలో వరుసగా మూడోసారి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్కు పట్టం గట్టాలని రాష్ట్ర ప్రజలు భావిస్తుండగా..అధికార పార్టీని అభివృద్ధి, సంక్షేమ పథకాల హామీలతో ఢీకొనలేమని భావించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అబద్ధాలు చెప్పి ఓటర్లను ఏమార్చేందుకు ప్రయత్నిస్తున్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వికారాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన కాంగ్రెస్ సభలో మాట్లాడిన రేవంత్రెడ్డి.. ప్రాణహిత, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులతోపాటు శాటిలైట్ టౌన్షిప్ల విషయంలో అవాస్తవాలు వల్లెవేసి మరోసారి అబద్ధాల రేవంత్గా నిలిచారన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తికాకపోవడానికి సీఎం కేసీఆర్ కారణామని రేవంత్రెడ్డి చెప్పటం అబద్ధాలకే పరాకాష్ఠ అని అంటున్నారు.
వాస్తవానికి ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పటి నుంచి కేసులు వేసి అడ్డుకుంటున్నది కాంగ్రెస్ నేతలు కాగా.. ఆ నెపాన్ని ముఖ్యమంత్రిపై మోపుతూ ‘దొంగే .. దొంగా దొంగా’ అని అరిచినట్టుగా ఉన్నదని స్థానికులు ఎద్దేవా చేస్తున్నారు. వికారాబాద్ శాటిలైట్ టౌన్షిప్ పనులకు సంబంధించి మొదటి విడత పనులకు అప్పటి యూపీఏ ప్రభుత్వం నిధులివ్వగా, ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఆ పథకం స్థానంలో స్మార్ట్సిటీ అని తీసుకొచ్చింది. శాటిలైట్ టౌన్షిప్ కథ యూపీఏ ప్రభుత్వం దిగిపోవడంతోనే ముగిసింది, ఈ విషయం జనాలకు చెప్పకుండా శాటిలైట్ టౌన్షిప్ పనులకు నిధులు రాకపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కారణమని రేవంత్ మాట్లాడటంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.