Asteroids | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): గుజరాత్లోని కచ్ ప్రాంతంలో దొరికిన రాతిశిలాల ఆనవాళ్లపై పరిశోధకులు కీలక విషయాలు వెల్లడించారు. ఇన్నేండ్లు హరప్పా కాలం నాటివిగా భావిస్తున్న ఆ శిలలు ఆస్టరాయిడ్స్ అని, హరప్పా కాలం నాటి కట్టడాలు కావని ఎన్జీఆర్ఐ, పలు భౌగోళిక అధ్యయన సంస్థలు స్పష్టం చేశాయి.
అగ్నిపర్వతాల విస్పోటం, లేదా అధిక ఐరన్ ధాతువులు ఉన్న మట్టి ఖగోళం నుంచి పడిందని ఆధారాలతో సహా వెల్లడించాయి. రాణ్ ఆఫ్ కచ్లోని లూనా కార్టర్ ప్రాంతానికి అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. ఇక్కడ రాతిశిలలన్నీ విభిన్నమైన ఆకృతిలో, ఎన్నో లోహ ధాతువులను కలిగి ఉండటంతో సింధు నాగరికతకు చెందిన ప్రాంతమని అంతా అనుకున్నారు. కానీ, అత్యాధునిక కార్బన్ డేటింగ్ టెక్నాలజీతో పరిశీలించగా.. వందల ఏండ్ల కిందట పడిన ఉల్కల వల్ల 1.8 కిలోమీటర్ల వెడల్పుతో గుంత ఏర్పడిందని పరిశోధకులు పేర్కొన్నారు.