హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): భూముల సమస్యలను పరిష్కరించాలంటూ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్కు ట్విట్టర్లో విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. గత రెండు రోజుల నుంచి వినతుల సంఖ్య పెరిగింది. మంగళవారం ఉదయం నుంచి పదుల సంఖ్యలో వినతులు వచ్చాయి. మంత్రి వాటిని పరిశీలించి.. పరిష్కరించాల్సిందిగా సంబంధిత జిల్లా కలెక్టర్లకు సూచనలు జారీచేశారు. ప్రధానంగా మ్యుటేషన్ కావట్లేదని, రైతుబంధు రావట్లేదని, పాస్బుక్ మంజూరు కాలేదని, డిజిటల్ సంతకం కాలేదని.. ఇలా రాష్ట్రం నలుమూలల నుంచి పలువురు బాధితులువిజ్ఞప్తి చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ సూచనల మేరకు ఆయా జిల్లాల రెవెన్యూ బృందాలు విజ్ఞప్తులను పరిశీలిస్తున్నాయి. దరఖాస్తు స్థితిని తెలుసుకొని, బాధితులు ధరణి పోర్టల్లోని గ్రివెన్స్ మాడ్యూల్ ద్వారా ఐప్లె చేసుకొంటే పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఒకవేళ అప్పటికే పరిష్కారం అయితే విషయాన్ని మంత్రి కేటీఆర్కు తిరిగి ట్వీట్ చేస్తున్నారు.
రాష్ట్రంలోని భూ సమస్యల పరిష్కారంపై కలెక్టర్లు దృష్టిపెట్టాలని సీఎస్ సోమేశ్ కుమార్ సూచించారు. రైతుబంధు సహాయాన్ని ఈ నెల 10లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో భూ సమస్యలపై రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను ఈ నెల 5లోగా పరిష్కరించాలని సీఎస్ మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తులను రోజుకు 20 శాతం చొప్పున పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఆధార్ అనుసంధానం కాకపోవడం, పేర్లు, విస్తీర్ణం తప్పుగా నమోదవడం, భూములను నిషేధిత జాబితాలో చేర్చడం లాంటి సమస్యలపై రైతులు దరఖాస్తు చేసుకునేందుకు ధరణి పోర్టల్లో గ్రీవెన్స్ మాడ్యూల్ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆధార్ అనుసంధానానికి సంబంధించి గత నెల 31 వరకు వచ్చిన 5,699 దరఖాస్తుల్లో 5,447 దరఖాస్తులను పరిష్కరించినట్టు అధికారులు తెలిపారు. మరో 252 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు. భూ సమస్యలపై 66,245 అభ్యర్థనలు రాగా.. 35,799 దరఖాస్తులను పరిష్కరించారు. మరో 30,466 పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్ మ్యుటేషన్లకు 1.43 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 1.38 లక్షల దరఖాస్తులను పరిష్కరించారు. మరో 5 వేల దరఖాస్తులు మాత్రమే పెండింగ్లో ఉన్నట్టు అధికారులు తెలిపారు. అధికారులు ఈ నెల 5వ తేదీలోగా వీటన్నింటనీ పరిష్కరిస్తే.. వారికి తొలి విడత రైతుబంధు సాయం అందుతుంది.