హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 23% నుంచి 42 శాతానికి పెంచాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రి సీతక్కను శుక్రవారం కలిసి వినతి అందజేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 23% మాత్రమే రిజర్వేషన్లు ఉండటంతో రాజకీయ అవకాశాలు దకడం లేదని వివరించారు.
కామరెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రకటించిన విధంగా బీసీల రిజర్వేషన్ల పెంపును చేపట్టాలని కోరారు. బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలంటే స్థానిక పాలనలో వారి ప్రాతినిధ్యం పెంచడం తప్ప వేరే మార్గం లేదని తెలిపారు.