మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని దేవాలయాలను పునర్నిర్మాణం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని గుళ్లకు కూడా దూప దీప నైవేద్యాల కోసం నిధులు కేటాయిస్తూ వాటికి పునర్వైభవం తీసుకువస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మంగళవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మంత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి కురవిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
కురవి వీరభద్ర స్వామి వారికి బంగారు కొరమీసాలు, భద్రకాళి అమ్మవారికి బంగారు ముక్కుపుడక సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్ర ప్రజలను సుఖ సంతోషాలతో చూడాలని, దేవుళ్లను కోరుకున్నట్లు తెలిపారు. కురవి ఆలయాన్ని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, తెలంగాణ వస్తే ఈ ఆలయానికి వచ్చి వీరభద్ర స్వామి వారికి బంగారు కోరమీసాలు, భద్రకాళి అమ్మవారికి ముక్కుపుడక చెల్లిస్తానని మొక్కుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ వచ్చాక మొక్కులు చెల్లించారన్నారు.
కురవి దేవాలయ అభివృద్ధికి ఐదు కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు.
సీఎం కేసీఆర్ కేటాయించిన నిధులతో ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, అవసరమైతే మరిన్ని నిధులు తెచ్చి కురవి దేవాలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
మంత్రితో పాటు మహబూబాబాద్ జడ్పీ చైర్ పర్సన్ కుమారి ఆంగోతు బిందు, జెడ్పిటిసి బండి వెంకట్ రెడ్డి, పెద్ద తండ సర్పంచ్ వనజ, టీఆర్ఎస్ నేతలు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మూల మధుకర్ రెడ్డి, శ్రీరామ్ నాయక్, శ్రీకాంత్ నాయక్, సుందర్ నాయక్, బోడ శ్రీను తదితరులు ఉన్నారు.