హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): కేంద్రం ఇటీవల విడుదల చేసిన గెజిట్లో అనుమతులు లేని ప్రాజెక్టుల జాబితాలో నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులను తొలగించాలని తెలంగాణ సర్కారు డిమాండ్ చేసింది. వెంటనే ఆ ప్రాజెక్టు అనుమతుల ప్రక్రియను చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర జలవనరులశాఖకు రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ గురువారం మూడు లేఖలను వేర్వేరుగా రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ నుంచి అన్ని అనుమతులను ఇప్పటికే పొందామని గుర్తు చేశారు. కేటాయించిన నీటిని తక్కువ సమయంలో వాడుకొనేందుకే మూడో టీఎంసీ ఎత్తిపోతల పనులను పూర్తిగా రాష్ట్ర నిధులతో చేపట్టిందని తెలిపారు.
దీనిని కొత్తగా ప్రాజెక్టును చేపట్టినట్టు పేర్కొనడమేగాక, గెజిట్లో అనుమతిలేని ప్రాజెక్టుల జాబితాలో కాళేశ్వరం ప్రాజెక్టును చేర్చారని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కొత్తదేమీ కాదని, అదనపు టీఎంసీ తరలింపునకు ఎలాంటి అనుమతులూ అక్కర్లేదని ఇప్పటికే కేంద్రమంత్రిని కలిసి సీఎం కేసీఆర్ వివరించారని గుర్తుచేశారు. ఇప్పటికైనా మూడో టీఎంసీ పనులను గెజిట్లో అనుమతులు లేని ప్రాజెక్టుల జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఎఫెక్ట్పై సమగ్ర అధ్యయనం చేయించాలని కోరారు. ముంపు ప్రాంతాల్లో తక్షణమే నివారణ చర్యలు, రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కృష్ణా ట్రిబ్యునల్ 2 అవార్డు అమలులోకి వచ్చేంత వరకు కర్ణాటక రాష్ట్రం చేపట్టిన అప్పర్తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులను నిలుపుదల చేయాలని కోరారు.