Congress | హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ రాష్ట్రం నుంచి లోక్సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు విముఖత వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి పోటీ చేయాలని పలుమార్లు రాష్ట్ర నేతలు విజ్ఞప్తి చేసినా వారు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పటికే ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పుకొన్న సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇక రాహుల్గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి మరోసారి బరిలోకి దిగుతారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తొలి జాబితా ద్వారా వెల్లడైంది. ప్రియాంక గాంధీ ఇదివరకు తన తల్లి ప్రాతినిధ్యం వహించిన రాయ్బరేలీ నుంచి పోటీకి సిద్ధమవుతున్నట్టు తెలిసింది. దీంతో గాంధీ కుటుంబానికి చెందిన నేతలెవరూ తెలంగాణ నుంచి పోటీ చేసే అవకాశాలులేనట్టు తెలుస్తున్నది.
విన్నపాల వెనుక ‘రాజకీయం’…
అధిష్ఠానం నేతలను రాష్ట్రం నుంచి మరీ ముఖ్యంగా ఖమ్మం, నల్లగొండ, భువనగిరి, మెదక్ స్థానాల నుంచి పోటీ చేయించాలని ప్రయత్నించడం వెనుక పెద్ద రాజకీయమే ఉన్నదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సీట్లలో రాష్ట్రస్థాయి నేతల నుంచి తీవ్ర పోటీ నెలకొంది. ఎవరికి సీటు దక్కినా ఇతరులు వారికి సహకరించే పరిస్థితి లేదు. దీంతో మధ్యేమార్గంగా అధిష్ఠానం నేతలు బరిలో నిలిస్తే తమకు ఈ తలనొప్పులు ఉండవని భావించినట్టు తెలిసింది. అయితే అధిష్ఠానం నేతలు మాత్రం విముఖత వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇప్పటికే రాష్ట్ర నేతల్లో అంతర్గత కుమ్ములాటలున్నాయి. ఈ కుమ్ములాటల మధ్య పోటీ చేస్తే ఓడిపోయినా పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదన్న ఉద్దేశంతోనే అధిష్ఠానం నేతలు విముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం.