Minister Seethakka | హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పేషీలో కర్ణాటకకు చెందిన వ్యక్తిని పీఎస్గా (ప్రైవేట్ సెక్రటరీ) నియమించుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బళ్లారికి చెందిన శ్రీజను పీఎస్గా నియమించుకున్నట్టు సమాచారం. ఆమెకు తెలుగులో మాట్లాడటం తప్ప, తెలుగు రాయడంగానీ, చదవడంగానీ రాదని తెలిసింది. శాఖాపరమైన కీలక నిర్ణయాలన్నింటిలోనూ ఆమె భాగస్వామ్యం ఉంటుందని సమాచారం. దీంతో ఈ నియామకం అటు రాజకీయ వర్గాల్లో, ఇటు నిరుద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది.
మంత్రి పేషీలో నియమించుకోవడానికి తెలంగాణలో ఎవరూ దొరకలేదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శాఖాపరమైన నిర్ణయాలు, పేషీలో ఫైళ్ల కదలిక కూడా ‘కర్ణాటక’ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందా? అంటూ ఎద్దేవా చేస్తున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లో మంత్రి సీతక్క పాల్గొన్న సమయంలోనూ సదరు మహిళ వెంబడే ఉన్నారట. దీనిని బట్టి ముందస్తుగానే కర్ణాటక నేతలతో ఒప్పందం కుదిరిందా? అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి సీతక్క పేషీ వివాదాల్లో ఉండగా, తాజా వ్యవహారం తలనొప్పిగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.