BRS | హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వీటితో కలుపుకొని పార్టీ ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 9కి పెరిగింది. మరో 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నది. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని, పార్టీ ముఖ్యనేతలు, క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు సేకరించి, అందరి ఏకాభిప్రాయంతో పార్టీ అధినేత కేసీఆర్అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. చేవెళ్ల నుంచి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, నిజామాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జహీరాబాద్ నుంచి గాలి అనిల్కుమార్, వరంగల్ నుంచి డాక్టర్ కడియం కావ్య (మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కుమార్తె) బరిలోకి దిగబోతున్నట్టు బుధవారం పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే ఖమ్మం (నామా నాగేశ్వరరావు), మహబూబాబాద్ (మాలోత్ కవిత), మహబూబ్నగర్ (మన్నె శ్రీనివాస్రెడ్డి), కరీంనగర్ (బోయినపల్లి వినోద్కుమార్), పెద్దపల్లి (కొప్పుల ఈశ్వర్) స్థానాలను ప్రకటించారు. ఈ 9 స్థానాల్లో మూడింటిని బీసీలకే కేటాయించడం విశేషం. జహీరాబాద్, నిజామాబాద్ స్థానాలను మున్నూరుకాపు, చేవెళ్లను ముదిరాజ్ సామాజిక వర్గానికి కేటాయించారు.
వరంగల్ ముఖ్యనేతలతో కేసీఆర్ భేటీ
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్లోని తన నివాసంలో వరంగల్ లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని ముఖ్యనేతలతో బుధవారం సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ నుంచి బరిలోకిదిగే అభ్యర్థి కోసం చర్చించారు. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు సహా ఇతర ముఖ్యనేతల సమక్షంలో మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ను పోటీచేయాలని కేసీఆర్ కోరారు. తన పేరును సూచించినందుకు కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపిన రమేశ్, తాను పోటీచేయలేనని, ఎవరిని ఉంచినా సహకరిస్తానని తెలిపారు. ఆ తర్వాత అందరి నిర్ణయంతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె డాక్టర్ కడియం కావ్యను వరంగల్ అభ్యర్థిగా ప్రకటించారు. సమావేశంలో ఎంపీ పసునూరి దయాకర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, గండ్ర వెంకటరమణారెడ్డి, హన్మకొండ జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, పార్టీ నేతలు నాగర్లు వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, సుందర్రాజ్, మెట్టు శ్రీనివాస్, బొల్లం సంపత్కుమార్, ఎడవెల్లి కృష్ణారెడ్డి, వాసుదేవరెడ్డి, ఎల్లావుల లలితాకుమార్ యాదవ్ పాల్గొన్నారు.
కేసీఆర్కు కృతజ్ఞతలు
తనకు జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసే అవకాశం కల్పించినందుకు గాలి అనిల్కుమార్ బుధవారం పార్టీ అధినేత కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. అనిల్కుమార్ను మాజీ మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి అభినందించారు.