హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ)/సుల్తాన్బజార్: తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్న నిరుపేద బాలికకు కోఠిలోని ఈఎన్టీ దవాఖాన వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. కార్పొరేట్ దవాఖానల్లో దాదాపు రూ.5 లక్షల వరకు అయ్యే అరుదైన శస్త్రచికిత్సను పైసా ఖర్చు లేకుండా నిర్వహించి ఆమెకు ఉపశమనం కల్పించారు. వివరాల్లోకి వెళ్లే.. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం గ్రామానికి చెందిన రవి, నాగమణి దంపతుల కుమార్తె హేమలత (10) గత కొన్ని రోజులుగా తీవ్రమైన శ్వాస సమస్యతో బాధపడుతున్నది. ఆమె తల్లిదండ్రులు రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేదలు కావడంతో కార్పొరేట్లో వైద్యం చేయించలేక కోఠిలోని ఈఎన్టి దవాఖానను ఆశ్రయించారు. ఆ బాలికకు వైద్యపరీక్షలు జరపగా.. శ్వాసనాళంలోని ‘కెరినా’కు కొంత పైభాగంలో పాపిలోమా (పులిపిరి లాంటిది) ఉన్నట్టు నిర్ధారణ అయింది. అది ట్రాఖియా (ఊపిరితిత్తులకు ఆక్సిజన్ అందించే శ్వాసనాళం రెండుగా విడిపోయే ప్రదేశం) ఎగువ భాగం వరకు వ్యాపించడంతో శ్వాసనాళం మూసుకుపోయినట్టు తేలింది.
దీంతో ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ సుదర్శన్రెడ్డి పర్యవేక్షణలో డాక్టర రవిశంకర్, డాక్టర్ సత్యకిరణ్, డాక్టర్ ఆశిష్, డాక్టర్ మీనా, డాక్టర్ ఉమ, డాక్టర్ నిఖిల రంగంలోకి దిగారు. శనివారం ఆ బాలికకు శస్త్రచికిత్స నిర్వహించి, విజయవంతంగా పాపిలోమాను తొలగించారు. ప్రస్తుతం ఆ బాలిక అందరిలానే శ్వాస తీసుకుంటున్నదని, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నదని డాక్టర్ సుదర్శన్రెడ్డి వెల్లడించారు. తదుపరి చికిత్స నిమిత్తం ఆమెను నిలోఫర్ దవాఖానకు తరలించినట్టు తెలిపారు. సాధారణంగా ఇలాంటి పాపిలోమాలు స్వరపేటికలో వస్తుంటాయని చెప్పారు. కానీ, ఈ చిన్నారికి కెరినా పైభాగంలో ఏర్పడడం అరుదైన విషయమని, ఇది ప్రాణాలకే ప్రమాదకరమని వివరించారు. నిరుపేద కుటుంబానికి చెందిన బాలికకు క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన వైద్యబృందాన్ని కోఠి ఈఎన్టీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ అభినందించారు.