సుప్రీంకోర్టు తీర్పునకు లోబడాలన్న హైకోర్టు
హైదరాబాద్, ఫిబ్రవరి 25 : అనధికార లేఔట్లలోని స్థలాలు, అనుమతులు లేకుం డా చేసిన నిర్మాణాల క్రయవిక్రయా లు, బదిలీలు, కానుకలుగా ఇచ్చే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఈ రిజిస్ట్రేషన్లు సుప్రీంకోర్టు వెలువరించే తీర్పునకు లోబడి ఉంటాయని ప్రతి డాక్యుమెంట్ మొదటి, చివరి పేజీల్లో పేరొనడంతోపాటు ఈసీల్లో కూడా స్పష్టం చేయాలని షరతులు విధించింది. చట్ట వ్యతిరేక ప్లాట్లు, భూములు, నిర్మాణాలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు, 30 అడుగుల రోడ్డు లేని లేఔట్లల్లోని స్థలాలు, నిర్మాణాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో కొనుగోలుదారులే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి ఇటీవల తుది ఉత్తర్వులు జారీచేశారు. అనధికార లేఔట్లలోని స్థలాల రిజిస్ట్రేషన్లను నిషేధిస్తూ రిజిస్ట్రేషన్ శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ గతంలో జారీచేసిన మెమోతో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్లు చేయాలని పేర్కొన్నది. 2020 ఆగస్టు 26న జారీచేసిన ఈ మెమో (జీ2/257/ 2019) అమలును నిలిపివేస్తూ ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును రద్దు చేయాలంటూ మున్సిపల్ శాఖ స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేసినప్పటికీ సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదని, అయినా తమ రిజిస్ట్రేషన్లు నిర్వహించేందుకు సబ్రిజిస్ట్రార్లు నిరాకరిస్తున్నారని 5 వేల మందికిపైగా బాధితులు హైకోర్టును ఆశ్రయించారు.
రిజిస్ట్రేషన్లను తిరసరించే అధికారం సబ్రిజిస్టార్లకు లేదని, వారి చర్యలను చట్ట విరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరారు. దీనిపై ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది హరేందర్ పరిషద్ స్పందిస్తూ.. అనధికార లేఔవుట్లు, నిర్మాణాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లను తిరసరించే అధికారం సబ్రిజిస్ట్రార్లకు ఉన్నదని తెలిపారు. లేఔట్లలో రోడ్ల వెడల్పు కనీసం 30 అడుగులు కూడా లేకపోతే ఎలాగని ప్రశ్నించారు. వీటి ని ఆమోదిస్తే భవిష్యత్తులో ఇదే తరహా అక్రమ లేఔట్లు భారీగా పుట్టుకొస్తాయని, వాటిలో స్థలాలను కొనుగోలు చేసినవారు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం జస్టిస్ విజయ్సేన్రెడ్డి స్పం దిస్తూ.. మున్సిపల్ శాఖ ఎస్ఎల్పీపై సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులు ఇవ్వనందున అధికారులు హైకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందేనని, ఈ విషయంలో ప్రభుత్వానికి మరో ప్రత్యామ్నాయం లేదని తేల్చిచెప్పారు. ఈ మేరకు సబ్రిజిస్ట్రార్లకు ఉత్తర్వులు జారీచేశారు. పిటిషన్లన్నింటినీ పరిష్కరించినట్టు ప్రకటించారు.