హైదరాబాద్, డిసెంబరు 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని విద్యుత్తు డిస్కంల పరిధిలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాలు (ఏఆర్ఆర్), 2016-17 నుంచి 2022-23 వరకు ట్రూ అప్ చార్జీల విషయంలో ప్రజలు, సంస్థలు, ఎన్జీవోల నుంచి అభ్యంతరాలను స్వీకరించేందుకు తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) తేదీలను నిర్ణయించింది.
దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సం స్థ (ఎస్పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్)తోపాటు సిరిసిల్లలోని సెస్లు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏఆర్ఆర్ నివేదికలను కొద్ది రోజుల క్రితం విద్యుత్తు నియంత్రణ కమిషన్కు సమర్పించాయి. 2016-17 నుంచి 2022-23 వరకు ట్రూఅప్ చార్జీలకు సంబంధించిన ప్రతిపాదనలుకూడా అందించాయి. ఈ రెండు అంశాలకు సంబంధించి మూడు సంస్థల పరిధిలో బహిరంగంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించనుంది. ప్రజాభిప్రాయ సేకరణలో ప్రత్యక్షంగా పాల్గొనలేని వారు రాతపూర్వకమైన అభ్యంతరాలు సలహాలను జనవరి 31 వరకు ఆయా సంస్థలకు పంపించవచ్చని తెలిపారు.