ములుగు : ఆపదలో ఉన్నవారిని కేటీఆర్ ఆదుకుంటున్న విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని.. ఇటీవలి భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన వారికి సహాయం చేస్తున్నారు తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి. కేటీఆర్ సేవా గుణాన్ని స్ఫూర్తిగా తీసుకుని.. ములుగు జిల్లాలోని వరద బాధితుల కోసం రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ(TSREDCO), తెలంగాణ సోలార్ అసోసియేషన్ తరఫున 5 లక్షల రూపాయల చెక్కును అలాగే.. వరద బాధితులను ఆదుకోవాలని సతీష్ రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు హెడ్ డిజిటల్ వర్క్స్ తరపున రూ.10 లక్షలు, బీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా ప్రెసిడెంట్ గుర్రాల నాగరాజు లక్ష రూపాయలు పంపించారు.
మొత్తం రూ. 16 లక్షల విలువైన చెక్కులను కలెక్టర్ ఇలా త్రిపాఠికి రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి అందజేశారు.
ఈ 16 లక్షల రూపాయలను వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోయి, సర్వస్వం కోల్పోయిన నాన్ ట్రైబల్స్ కి ఒక్కో కుటుంబానికి రూ.10వేల చొప్పున అందజేయనున్నట్టు సతీష్ రెడ్డి తెలిపారు.
ట్రైబల్స్ కు ఇప్పటికే ఐటీడీఏ తరఫున తక్షణ సాయం కింద కుటుంబానికి రూ.25 వేలు అందజేశామన్నారు.
వరదసహాయక చర్యలపై ఆరా తీశారు. వరద బాధిత గ్రామాల్లో ఇళ్లు కోల్పోయిన వారి, పాక్షికంగా ఇళ్లు దెబ్బతిన్న వారి వివరాల సేకరణ, వారికి ప్రభుత్వం నుంచి, స్వచ్ఛంద సంస్థల నుంచి ఎలాంటి సహాయం అందించాలనే అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా వరద బాధితులను ఆదుకునేందుకు సతీష్ రెడ్డి చేస్తున్న కృషిని కలెక్టర్ ఇలా త్రిపాఠి అభినందించారు.