హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): కేంద్రం ఆధీనంలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కాస్తా ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బీజేపీగా, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరోగా మారిందని రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లో జరిగిన ఫార్ములా ఈ-రేస్కు సంబంధించి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చాలా పెద్ద తప్పుచేసిందని శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీని పీఐబీ మించిపోయిందని ఎద్దేవాచేశారు. నిజానికి ఫార్ములా ఈ-రేస్ విజేత జియాన్ ఎరిక్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బహుమతి అందజేస్తే, కేంద్ర సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలో పనిచేసే పీఐబీ తెలంగాణ విభాగానికి కనిపించకపోవడం బాధాకరమన్నారు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ఠాకూర్ విజేతకు బహుమతి అందజేసినట్టుగా పీఐబీ తన అఫిషియల్ ట్విట్టర్ పేజీలో పేర్కొన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ-రేస్ చూసేందుకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సైతం పీఐబీ తరహాలోనే వ్యాఖ్యానించటం సిగ్గుచేటన్నారు. కేంద్ర సహకారం వల్లే హైదరాబాద్లో ఫార్ములా ఈ-రేస్ జరిగిందంటూ కిషన్ రెడ్డి పేర్కొనటం ఆయన అవివేకానికి నిదర్శనమని చెప్పారు. అనేక దేశాలు, ఎన్నో పట్టణాలు పోటీపడినా రాష్ట్ర ప్రభుత్వ చొరవ, మంత్రి కేటీఆర్ నిరంతర కృషితో ఫార్ములా ఈ -రేస్ హైదరాబాద్లో జరిగిందని, కిషన్రెడ్డి అంతా తామే చేశామని డబ్బా కొట్టుకోడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.