కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నియామకాలు
రాష్ట్రమంతటా ఉన్నత విద్యాసంస్థల విస్తరణ
హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని యూనివర్సిటీల్లోని బోధన, బోధనేతర పోస్టులను ఏకీకృత విధానంలో భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. క్యాబినెట్ సమావేశం తదనంతరం సీఎం కేసీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో మూడున్నర వేల పైచిలుకు ఖాళీలున్నాయని తెలిపిన కేసీఆర్, వీటిని ఎవరికి వారే భర్తీచేయడం వల్ల ఇబ్బందులు, ఆరోపణలు వస్తున్నాయన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, లేదా ఇతరత్రా మెకానిజం ద్వారా పారదర్శకంగా స్టాఫ్ను భర్తీచేస్తామన్నారు. యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీ చేపట్టి, ఎంపికైన వారిని యూనివర్సిటీలకు కేటాయిస్తామన్నారు.
మహిళా విశ్వవిద్యాలయానికి ఆమోదం
రాష్ట్రంలో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల ఏర్పాటు హైదరాబాద్కే పరిమితం కాకుండా ఇతర నగరాలకు విస్తరింపచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ముఖ్యంగా వరంగల్, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లో నూతన ఉన్నత విద్యాసంస్థల స్థాపనను ప్రోత్సహించాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రిని క్యాబినెట్ ఆదేశించింది. రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీ, కొత్త విద్యాసంస్థల ఏర్పాటుతో తెలంగాణ, హైదరాబాద్ ప్రపంచస్థాయి ప్రమాణాలు గల ఎడ్యుకేషన్ హబ్గా మారుతాయని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. మహిళా వర్సిటీ ఏర్పాటుకు క్యాబినెట్లో ఆమోదం లభించడం పట్ల సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్తోపాటు వరంగల్, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో సైతం ఉన్నత విద్యాసంస్థలను ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్ తమను ఆదేశించారని, ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని చెప్పారు.
డైరెక్టర్, ఏడీలుగా వైద్యకళాశాలల ప్రొఫెసర్లు
గతంలో ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ పరిమితిని 65 సంవత్సరాలకు క్యాబినెట్ పెంచింది. తాజాగా మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లను డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్, అడిషనల్ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్గా నియమించడానికి అనుమతినిస్తూ నిర్ణయం తీసుకొన్నది.