కాశీబుగ్గ, జూలై 31: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం పసుపు ధర రికార్డు స్థాయిలో క్వింటాల్కు రూ.11,010 పలికింది. గత ఆరేండ్లుగా రూ.7 వేలు మాత్రమే ఉండగా.. ఈ సీజన్ అమాంతం రూ.11 వేలకు పెరగడంతో పసుపు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు 32 వేల 90 క్వింటాళ్ల పసుపు వచ్చింది. సోమవారం 186.6 క్వింటాళ్ల పసుపు రాగా క్వింటాల్కు గరిష్ఠంగా రూ.11,010, మధ్యరకానికి రూ.10 వేలు, కనిష్ఠంగా రూ.9,100 పలికినట్టు మార్కెట్ అధికారులు తెలిపారు. కాగా.. హనుమకొండ జిల్లా నడికూడ మండలం కొక్కొండకు చెందిన గోల్కొండ సదయ్య 10 బస్తాల పసుపును తీసుకురాగా అత్యధిక ధర దక్కినట్టు అధికారులు పేర్కొన్నారు.